హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ): వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లు మళ్లీ సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదని ఏఈవోలు తెలిపారు. దీంతో సమ్మె చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2600 మంది ఏఈవోలు మూకుమ్మడిగా సెలవు పెట్టేందుకు యోచిస్తున్నట్టుగా తెలిసింది.
సర్వే చేయడం ప్రారంభిస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏఈవోల సమస్యల పరిష్కారంపై వ్యవసాయ శాఖ కార్యదర్శి చేతులెత్తేసినట్టుగా తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తానేమీ చేయలేనని స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ‘మీ ఇష్టముంటే సర్వే చేయండి. లేదంటే చేయకండి.’ అంటూ తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. ఇక ఏఈవోలపై సస్పెన్షన్ ఎత్తివేతపైనా కార్యదర్శి స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది.
వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఏఈవోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనే తప్పా.. సమస్యలు పరిష్కరించి.. పని చేయించుకోవాలనే దిశగా ఆలోచించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వారం క్రితమే సమ్మెకు వెళ్లాలని భావించామని, హామీతో విరమించుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు సమస్యల పరిష్కారంపై చెతులెత్తేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మొండి వైఖరికి నిరసనగా మూకుమ్మడి సెలవు పెట్టేందుకు ఆలోచన చేస్తున్నామని ఏఈవో సంఘం నేతలు తెలిపారు.