ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు అమిత్ జింగారన్ వెల్లడి
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): 2022-23 వార్షిక క్రెడిట్ ప్లాన్లో వ్యవసాయ రంగానికి 60.76% నిధులు అంటే రూ.1,01,030.04 కోట్లు కేటాయించినట్టు ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగారన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో అమిత్ జింగారన్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 33వ త్రైమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరంతో పోలిస్తే వార్షిక క్రెడిట్ ప్లాన్ 15% అధికంగా కేటాయించినట్టు తెలిపారు. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు రూ.60,616.07 కోట్లు డిపాజిట్లు సేకరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కే నిఖిల, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వైకే రావు, ఎస్ఎల్బీసీ తెలంగాణ కన్వీనర్ కృష్ణశర్మ, వివిధ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.