హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానంపై కలిసి పనిచేసేందుకు యునెస్కో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆదివారం ఒప్పంద పత్రాలపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, యునెస్కో డైరెక్టర్ ఏఐ డాక్టర్ మరియా గ్రాంజియా స్కీసియారిని, తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి లంక సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏఐపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని రమాదేవి తెలిపారు. ఇప్పటికే ఏఐ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీ-ఎయిమ్) పేరిట ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. దీనికి సంబంధించిన పురోగతిపైనా కూడా ఒక నివేదికను విడుదల చేసిందని వెల్లడించారు.