జ్యోతినగర్, ఏప్రిల్ 2: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు స్టేజ్-2 విద్యుత్తు థర్మల్ పవర్ కేంద్రం విద్యుదుత్పత్తి కొనుగోలుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. మొన్నటివరకు సుముఖత చూపకపోవడంతో ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ర్టాలతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) చేసుకోవడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి గురువారం 800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు పీపీఏ చేసుకున్నది. మిగిలిన 1,600 మెగావాట్లలో గుజరాత్ ప్రభుత్వం 800 మెగావాట్లు, కర్ణాటక ప్రభుత్వంతో 600 మెగావాట్లకు ఇప్పటికి పీపీఏ కుదిరినట్టు తెలిసింది. ఇటీవలే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ చేసుకోవాలని లేఖ రాశారు. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇతర రాష్ర్టాలతో సంప్రదింపుల నేపథ్యంలో ట్రాన్స్కో కార్యాలయంలో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులతో ఎన్టీపీసీ కమర్షియల్ జీఎం ఒప్పంద సంతకాలు చేసుకున్నారు.