హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/ సికింద్రాబాద్/మారేడుపల్లి/బొల్లారం/ బన్సీలాల్పేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసన జ్వాలలు రాష్ర్టాన్ని తాకాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరుద్యోగ యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల ఆగ్రహానికి నాలుగు రైల్వేబోగీలు దహనమవగా.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో నిరుద్యోగి ఒకరు మృతిచెందారు. మృతుడిని వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేశ్ (21)గా గుర్తించారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో 12మంది నిరసనకారులు గాయపడ్డారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని, పూర్తిస్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్ద 1500మందికి పైగా యువకులు శుక్రవారం ఉదయం మెరుపు ఆందోళనకు దిగారు. రైలురోకోకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తొలుత కేంద్ర బలగాలపై రాళ్లు విసిరిన యువకులు.. తర్వాత రైల్వే ఆస్తులపై విరుచుకుపడ్డారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ప్లాట్ఫాంపై నిలిచి ఉన్న పలు రైళ్ల బోగీలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై రైల్వేపోలీసులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. 12మంది యువకులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పదులసంఖ్యలో యువకులను ఆర్పీఎఫ్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉద్రిక్తతల మధ్య అట్టుడికింది. రణరంగాన్ని తలపించిన ఆ ప్రాంతం నుంచి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో పలురైళ్లను అధికారులు రద్దు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు.
2021వ సంవత్సరం ఫిబ్రవరిలో ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత సాధించిన నాలుగు వేల మందికి దేహదారుఢ్య పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాయి. వీళ్లంతా రాత పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాత పరీక్షలు 8 సార్లు వాయిదా పడుతూ వచ్చి, చివరకు రద్దు చేశారు. తాజాగా కేంద్రం స్వల్పకాలిక సైనిక సేవల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకం ఈ నాలుగు వేల మందిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. వారంతా వాట్సాప్ వేదికగా ఏకమయ్యారు. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, 3 వేల మందితో నెట్వర్క్గా ఏర్పడ్డారు. తొలుత హకీంపేట ఆర్మీ క్యాంపస్ ముందు నిరసన వ్యక్తంచేయాలని భావించిన వీరు.. బీ హార్లో ఆందోళన చూసిన తర్వా త తమ ఆందోళనను సికింద్రాబాద్ స్టేషన్ వైపు మళ్లించారు. శుక్రవారం ఉదయానికి 1500మంది వరకు యువకులు సికింద్రాబాద్ స్టేషన్ వద్ద పోగయ్యారు.
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే కేంద్రం రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసనకారులు బృందాలుగా విడిపోయారు. కొందరు రైల్వే ఆస్తులపై దాడులు చేయడం మొదలుపెట్టారు. వారిని అదుపు చేసేస్థాయిలో రైల్వే బలగాలు అందుబాటులో లేకపోవడంతో వారు మరింత రెచ్చిపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఒకటి నుంచి మూడో ప్లాట్ఫాం వరకు వారు వెళ్లిపోయారు. కనిపించిన వాటన్నింటినీ ధ్వంసం చేస్తూ పోయారు. స్టాళ్లు, దుకాణాలపై దాడి చేశారు. పార్సిల్ కార్యాలయంలోకి చొరబడి చేతికి అందిన వస్తువులను తీసుకొచ్చి రైలు పట్టాలపై వేసి తగులబెట్టారు. చుట్టూ ఏం జరుగుతున్నదో తెలియనిస్థితిలో ప్రయాణికులు భీతావహులై పరుగులు తీశారు. స్టేషన్లో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. మరోఅడుగు ముందుకేసిన ఆందోళనకారులు.. ప్లాట్ఫాంపై ఉన్న ఈస్ట్కోస్ట్, అజంతా, రాజ్కోట్ ఎక్స్ప్రెస్ ఇంజన్లకు, బోగీలకు నిప్పుపెట్టారు, ఈస్ట్కోస్ట్ రైలులో పార్సిల్కు సిద్ధంగా బోగీ తెరిచి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. రైలు ఇంజిన్లతోపాటు పలు బోగీలు దహనమయ్యాయి. ఒక ఎంఎంటీఎస్ రైలు బోగీ కూడా నిరసనాగ్నిలో కాలిపోయింది. గరీబ్థ్,్ర శబరి, రాయ్పూర్ ఎక్స్ప్రెస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. మూడు లోకో ఇంజిన్లు, యాక్సిడెంట్ రిలీఫ్ రైలుకు సంబంధించిన నాలుగు బోగీలు కూడా ఆందోళనకారుల చేతిలో ధ్వంసమయ్యాయి.
రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ఆర్పీఎఫ్ పోలీసులు లాఠీచార్జి చేశారు. అంతటితో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన యువకులు రైల్వే పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. స్టేషన్ లోపలే కాదు, బయట కూడా బస్సు లు, వాహనాలపై యువకులు రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటుతున్నదని భావించిన రైల్వే పోలీసులు వారిపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో పలువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలిస్తుండగా, వరంగల్కు చెందిన దామెర రాకేశ్(18) అనే నిరుద్యోగి మృతిచెందాడు. 10మంది వరకు యువకులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా గాంధీ దవాఖానలో చికిత్సపొందుతున్నారు. రాకేశ్కు తల, కడుపు భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయని, అందుకే ఆయన ఘటనాస్థలంలోనే మృతిచెందాడని సమాచారం.
కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని, అంతవరకు తమ పోరాటం ఆగదని నిరసనకారులు హెచ్చరించారు. సికింద్రాబాద్లో కాల్పుల అనంతరం కూడా నిరసన కొనసాగింది. సాయంత్రం ఆరుగంటల వరకు బ్యాచులు బ్యాచులుగా యువకులు.. రైలుపట్టాలపై వారు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైనిక కొలువుల కోసం ఎన్నో ఏండ్లుగా తాము శ్రమిస్తున్నామని, నిరుద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్ను యథావిధిగా కొనసాగించాలని, తమ డిమాండ్ల కోసం చావడానికైనా తాము సిద్ధమేనని వారు స్పష్టంచేశారు. రైల్వే డీజీ సందీప్ శాం డిల్య ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. చివరకు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు పంపించారు. రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.
అగ్నిపథ్ ఆందోళనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆర్పీఎఫ్ కాల్పులు, లాఠీచార్జితోపాటు నిరసనకారుల రాళ్లదాడిలో గాయపడిన 14మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మొత్తం నలుగురు యువకులకు బుల్లెట్ గాయాలైనట్లు గుర్తించారు. ఇద్దరికి అత్యవసర శస్త్రచికిత్స చేశామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. వికారాబాద్ జిల్లా గుండ్రేటిపల్లికి చెందిన డి.మహేశ్ (22)కు వీపులో నుంచి ఛాతి భాగానికి బుల్లెట్ దిగింది. తీవ్రంగా గాయపడటంతో బాధితుడికి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన బానోత్ నాగేంద్రబాబు (20)కు తొడ భాగంలో బుల్లెట్ దిగడం వల్ల అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు. గాయాలపాలై గాంధీలో చికిత్స పొందుతున్నవారిలో జగన్నాథ్ రంగస్వామి (కర్నూల్), కే.రాకేశ్ (కరీంనగర్), జే.శ్రీకాంత్ (మహబూబ్నగర్), జీ.పరశురామ్ (కామారెడ్డి), ఎ.కుమార్ (వరంగల్), పి.మోహన్ (కామారెడ్డి), ఎల్.వినయ్ (మహబూబ్నగర్), విద్యాసాగర్ (ఆసిఫాబాద్), లక్ష్మణ్రెడ్డి (నల్గొండ), భరత్ (నిర్మల్కు), వి.మల్లికార్జున్ (కొండగల్, వికారాబాద్) ఉన్నారు. కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేశ్ మృతదేహానికి గాంధీలో పోస్టుమార్టం నిర్వహించి స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్పేట గ్రామానికి ఆంబులెన్స్లో తరలించారు.
నిరుద్యోగ యువత వివిధ మార్గాల ద్వారా శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. తొలుత స్టేషన్ ఆవరణలో నిరసన చేపట్టిన వారు.. ఆ తర్వాత రైల్రోకో చేపట్టేందుకు స్టేషన్లోనికి దూసుకెళ్లారు. రైలు ఇంజిన్ ఎదుట బ్యానర్లు పట్టుకుని అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన కొనసాగుతుందనుకునే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. పట్టాలపై బైఠాయించినవారిపై రైల్వే పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి. తర్వాతి పరిణామాలతో సికింద్రాబాద్ స్టేషన్ రణరంగంగా మారింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోఅగ్నిపథ్ ఆందోళనతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. శుక్రవారం రాత్రి 8గంటల వరకు 28 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 70ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కాగా, 8 రైళ్లను దారి మళ్లించారు. 19 రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు. మరో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను టెర్మినల్ స్టేషన్కు మార్చారు. ఆందోళన సమయంలో సికింద్రాబాద్ వైపు వచ్చే పలు రైళ్లను చర్లపల్లి, మౌలాలి తదితర సమీప స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికుల కోసం ఆహారం, మంచినీరు ఏర్పాటు చేశారు.రద్దు అయిన రైళ్ల ప్రయాణికులకు టికెట్ల చార్జీలను తిరిగి చెల్లించడానికి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు తోడ్పాటుగా హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
ఎక్కడో బార్డర్లో తాకాల్సిన బుల్లెట్టు.. ఇక్కడ ఆర్పీఎఫ్ చేతిలో పేలింది. ఈ ఆందోళన ద్వారా మా భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించడం లేదు. 2014లో తెలంగాణ కోసం ఎట్ల కొట్లాడినమో.. ఇప్పుడూ అట్లనే కొట్లాడుతం. కేసులకు భయపడం
– సికింద్రాబాద్ ఆందోళనలో ఓ ఉద్యోగార్థి
మేం ఆర్మీ అభ్యర్థులం అన్నా.. మా వెనుక రాజకీయ నాయకులెవ్వరూ లేరు. వారి అవసరం కూడా మాకు లేదు. ఓన్లీ స్టూడెంట్సే మా వెంట ఉన్నరు. దీనికి టీఆర్ఎస్తో సంబంధమే లేదు. మా సమస్యతోనే ఇక్కడకి వచ్చినం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏమంటున్నడు? టీఆర్ఎస్ వాళ్లే చేయిస్తున్నరని అంటున్నడు. ఈ సమస్య సెంట్రల్ది. అందుకే ఇక్కడ (రైల్వేస్టేషన్ దగ్గర) నిరసనకు దిగినం. ఇట్ల మాట్లాడితే బండి సంజయ్..నీ.. పగుల్తది.
– బండి సంజయ్కి ఓ ఆర్మీ అభ్యర్థి హెచ్చరిక