మహబూబ్నగర్, మార్చి 4 : కంపెనీ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుందని, ఎవరికీ ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చి ఇప్పుడు మరిన్ని భూములు కావాలంటూ తమపై ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శివారులోని దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో నిర్మిస్తున్న అమరరాజా లిథియం కంపెనీ వద్దకు దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్దాయపల్లి గ్రామాలకు చెందిన శ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి, చిన్నకృష్ణతోపాటు పలువురు మహిళలు చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు ముందు నిర్వాహకులు మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారని, కానీ ఇప్పుడు కంపెనీ చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతుల వద్దకు వచ్చి మీ భూమి ఎందుకూ పనికి రాదని, ఎప్పటికైనా మాకే అమ్మక తప్పదని మాయమాటలు చెప్పి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది రైతులు భూమినే నమ్ముకుని జీవిస్తున్నారని, కంపెనీ పనులు చేపట్టి కొన్ని రోజులే అయినందున ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నీరు, గాలి కలుషితం అయ్యే అవకాశాలున్నాయని, కంపెనీని తరలించే వరకు ఆందోళన చేపడుతామని భీష్మించుకూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కంపెనీ వద్దకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడినప్పటికీ వినకపోవడంతో పోలీసులు ఆర్డీవో, మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరావుకు విషయాన్ని తెలిపారు. కొద్దిసేపు పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరుగగా, కలెక్టర్ను కలుద్దామని చెప్పడంతో ఆందోళనకారులు మహబూబ్నగర్ కలెక్టరేట్కు వెళ్లారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవోను కలిసి సమస్యను వివరించారు. మంగళవారం సాయం త్రం 4 గంటలకు కలుస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.