Nirmal | దిలావర్పూర్, జనవరి 3: రైతులపై లాఠీ దెబ్బ పడింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంట పొలాలను కలుషితం చేసే ఈ పరిశ్రమను తరలించాలంటూ బుధవారం గుండంపెల్లి, దిలావర్పూర్, న్యూలోలం, సముందర్పెల్లి గ్రామాలకు చెందిన దాదాపు 10 వేల మంది రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. పరిశ్రమల లోపలికి చొచ్చుకెళ్లి గోడలు, సామగ్రి, షెడ్లను కూల్చివేశారు. టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న స్కార్పియో వాహనాన్ని బోల్తా పడేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఫ్యాక్టరీ లోపలికి మహిళలు వస్తుండగా, పోలీసులు అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు.
తమ ప్రాణాలకంటే పరిశ్రమ ఏర్పాటుకే సహకరిస్తున్నారని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న నిర్మల్ అడిషనల్ ఎస్పీ క్రాంతిలాల్ పాటిల్.. అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. సముదాయించేందుకు ప్రయత్నించగా కలెక్టర్ రావాలని అన్నదాతలు పట్టుబట్టారు. నిర్మల్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్ కూడా వచ్చి రైతులతో మాట్లాడారు. పరిశ్రమను నిలిపివేస్తామంటేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పటంతో కొంతమంది రైతులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని 20 మందితో కమిటీ వేస్తామని తెలిపారు. కమిటీ వద్దని పరిశ్రమను రద్దు చేస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని, రైతులు మళ్లీ రోడ్డు పై బైఠాయించారు. కాగా, బోల్తాపడిన స్కార్పి యో వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీచార్జి చేసి, అక్కడి నుంచి పంపించేశారు.
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గురువారం దిలావర్పూర్, గుండంపల్లితోపాటు వివిధ గ్రామాలు బంద్ పాటించాలని రైతులు, గ్రామస్థులు పిలుపునిచ్చారు. హైవేపై వంటావార్పు, బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. తాము నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పచ్చని పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేసి, ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.