హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవకుండా అప్రమత్తంగా ఉండాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. ఐటీడీఏల పరిధిలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులు, పాఠశాలల ప్రారంభం, విద్యార్థుల హాజరు, సీజనల్ వ్యాధులు, చేపట్టాల్సిన చర్యలపై ఆమె గురువారం హైదరాబాద్లోని సంక్షేమభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గర్భిణులకు వారి ప్రసవ గడువు తేదీల ప్రకారం హాస్పిటల్లో చేర్పించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్ని ఐటీడీఏల పరిధిలోని అధికారులు ఎప్పటికప్పుడు వీడియో, టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అనాథ పిల్లల్ని గుర్తించి వారిని గురుకులాలు ప్రారంభం అయ్యేంతవరకు సమీపంలోని ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించాలని చెప్పారు. వానకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు సెలవులు పెట్టకుండా అందుబాటులో ఉండాలన్నారు. పరిస్థితి చక్కబడేవరకు మండలానికి ఒక అధికారిని ఇంచార్జ్జిగా నియమించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏటూర్నాగారం, ఉట్నూరు, భధ్రాచలం, కొత్తగూడెం, మన్ననూరు, మైదాన ప్రాంత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సహాయ అధికారులు గౌతమ్, భవేశ్ మిశ్రా, అశోక్, చందనతో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, అదనపు సంచాలకులు సర్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.