Balagam Movie | ఓదెల : బంధుత్వాల విలువను చాటిచెప్పిన బలగం సినిమా మరో కుటుంబంలో మార్పు తీసుకొచ్చింది. చిన్న చిన్న కారణాలతో దూరమైన అన్నదమ్ములు ఎంతోమందిని కలిపిన ఈ సినిమా చూసి దూరమైన బంధువులు మళ్లీ కలిశారు. దాదాపు 156 మంది కుటుంబసభ్యులు ఒక్కచోట చేరి సరదాగా గడిపారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఇరగోని మల్లయ్య – ఆగవ్వ దంపతులది పెద్ద కుటుంబం. కానీ మనస్పర్థల కారణంగా చాలా ఏండ్ల క్రితమే విడిపోయి.. ఎవరికి వారే అన్నట్లుగా బతుకుతున్నారు. వీరిలో కొందరు ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో యెల్దండి వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాను చూశారు. కుటుంబ విలువలు, అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే ఈ చిత్రాన్ని చూసిన తర్వాత వారిలో చలనం వచ్చింది. ఏండ్ల క్రితమే విడిపోయిన తమ కుటుంబాన్ని ఏకం చేయాలని పూనుకున్నారు. వేర్వేరు ప్రాంతాలకు వలసవెళ్లి స్థిరపడిన వాళ్లందరినీ ఒక్కచోట చేర్చే ప్రయత్నం చేశారు. అందర్నీ ఒప్పించి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరగోని మల్లయ్య-ఆగవ్వ కొడుకులు- కోడళ్లు, కూతుళ్లు- అల్లుళ్లు, మనమళ్లు-మనమరాళ్లు దాదాపు 156 మంది ఒక్కచోట చేరారు. ఆటపాటలు, మాట ముచ్చటలతో రోజంతా సరదాగా గడిపారు. పెద్దలను సన్మానించి గౌరవించుకున్నారు.