CM KCR | స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆలయాలను నిర్మించిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ పాలనలో ఆ అద్భుతం ఆవిష్కృతమైంది. నరసింహ, స్కాంద, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాల్లో ఎంతో ప్రశస్తి కలిగిన యాదగిరి గుట్ట ఆలయాన్ని పునర్నిర్మించి ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త అధ్యాయానికి బీఆర్ఎస్ సర్కారు నాంది పలికింది. రాష్ట్రంలోని మిగతా ఆలయాలను కూడా యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తూ మునుపెన్నడూలేని రీతిలో తొమ్మిదేండ్లలో దాదాపు రూ.2,800 కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. అంతేకాదు, ఆర్థికంగా అత్యంత వెనుకబాటుకు గురైన బ్రాహ్మణుల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.212 కోట్లు ఖర్చుచేసింది. స్వయంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ స్థానిక సంప్రదాయాలు, ఆలయాలు, పండుగలు, వేడుకలకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. హిందుత్వ గుత్తేదారులుగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ఈస్థాయిలో ఆలయాల అభివృద్ధి కానీ, బ్రాహ్మణుల సంక్షేమంకానీ అమలు కాలేదు. ఇది నిజం.
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి గడిచిన తొమ్మిదేండ్లలో సర్కారు దాదాపు రూ.2,800 కోట్లు ఖర్చు చేసింది. వెనుకబడిన బ్రాహ్మణులకు, ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఆర్థిక సాంత్వన కలిగించే ఉద్దేశంతో వివిధ పథకాల ద్వారా రూ.212 కోట్లు కేటాయించింది. ఫలితంగా ఉమ్మడిపాలనలో దీపం పెట్టే దిక్కులేని ఎన్నో ఆలయాలు.. ఇప్పుడు ప్రతి దినం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.
ఓ ఎములాడ రాజన్నా..
మా దైవం నీవన్నా !
మా దేవుడు నీవన్నా..
మా దిక్కే నీవన్నా !!
దక్షిణ కాశీగా పిలిచే వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి ఆలయం ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఏ మాత్రం నోచుకో లేదు. అయితే, వెయ్యేండ్ల చరిత్ర కలిగి, శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన మతాలెన్నింటికో ఆలవాలమైన ఈ ఆలయం కొత్త శోభతో వెలుగొందాలని కేసీఆర్ సర్కారు నిర్ణయిం చింది. వీటీడీఏ 35 ఎకరాల భూమిని సేకరించింది. ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.70 కోట్లు వ్యయం చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో వేములవాడ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించింది.
అత్రనారాయణశ్రీ్శమాన్నృహరి స్సర్వశక్తిమాన్ !
అర్చారూపేణ ఛాద్యాస్తే భక్తానాం కల్పకద్రుమః !!
యాదగిరిలో శ్రీమన్నారాయణుడు నరసింహావతారుడై సర్వశక్తులతో భక్తులకు కల్పకద్రుమమై అర్చారూపముతో వేంచేసి ఉన్నాడని సాక్షాత్తూ పరమశివుడే యాదగిరి గుట్ట క్షేత్రం గురించి పార్వతీదేవితో అన్నారట. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశిష్టత నరసింహ, స్కాంద, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాల్లోనూ ఉన్నది. ఇంతటి మహత్తు కలిగిన ఈ దివ్యక్షేత్రం సమైక్యరాష్ట్ర పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఇది చూసి తట్టుకోలేని సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే యాదగిరిని సమూలంగా పునర్నిర్మించి దేదీప్యమానంగా, భూలోక వైకుంఠంగా, తిరుమలకు దీటుగా మార్చాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే యాదగిరిగుట్ట ఆలయాన్ని దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో సర్కారు పునర్నిర్మించింది. ఈ ఏడాది బడ్జెట్లో యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించింది.
యైర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా!
యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలఃకృతః!!
తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర!
ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు!!
ఉమ్మడి రాష్ట్ర పాలకులు కాళేశ్వరాన్ని త్రిలింగ క్షేత్రంగా పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించి సరిపుచ్చారు. దీనికి సరిజోడైన శ్రీశైలం, ద్రాక్షారామం క్షేత్రాలు మహా వైభవోపేతంగా అలరారుతుండగా.. కాళేశ్వర శ్రీముక్తేశ్వరస్వామి క్షేత్రం ఎలాంటి అభివృద్ధికి, ఆదరణకు నోచుకోలేదు. దీంతో అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం రూ.25 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా పునరుద్ధరిస్తున్నారు. మరో 8 ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. దక్షిణ భారతంలోనే ఏకైక సరస్వతీ క్షేత్రమైన బాసర శ్రీజ్ఞానసరస్వతి దేవి ఆలయాన్ని రూ.50 కోట్లతో, ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించారు.
ఆలయాల అభివృద్ధే కాదు.. ఆలయ భూములు అన్యా క్రాంతం కాకుండా కేసీఆర్ నేతృత్వంలో దేవాదాయ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉమ్మడి పాలనలో అన్యాక్రాంతమైన ఆరువేల ఎకరాల ఆలయ భూములను న్యాయపోరాటం చేసి స్వాధీనం చేసుకున్నది. ఆయా భూముల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునేలా షాపింగ్ కాంప్లెక్స్, కార్యాలయాలు, కల్యాణ మండపాలు, పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ పండుగలు, జాతరలను వైభవంగా నిర్వహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్ర పండుగ మేడారం జాతరకు సుమారు రూ.75 కోట్ల చొప్పున కేటాయిస్తున్నది. బోనాల పండుగకు ఇప్పటివరకు రూ.93.15 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఏటా 3,033 ఆలయాలకు పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ చీరల కోసం ఏటా దాదాపు రూ.350 కోట్ల వరకు వెచ్చిస్తున్నది. భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవంతోపాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గోదావరి, కృష్ణ, తుంగభద్ర పుషరాలను విజయవంతంగా నిర్వహించింది.
20 ప్రధాన ఆలయాల్లో పూజలు, వసతి బుకింగ్, ప్రసాదం పంపిణీ తదితర ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల నుంచి భక్తుల ఇంటికే ప్రసాదాలను పంపేందుకు పోస్టల్ శాఖ సేవలను వినియోగించుకుంటున్నారు. భద్రాద్రి రాములవారి తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చేందుకు కొరియర్ సేవలను ప్రారంభించారు. ఈ సేవల ద్వారా ఏటా సగటున 1.5 లక్షల మంది భక్తులకు తలంబ్రాలు పంపిణీ చేస్తున్నారు. మేడారం సమ్మక, సారలమ్మ ప్రసాదాన్ని జాతర సమయంలో నేరుగా ఇంటికి పంపించే సదుపాయాన్ని తీసుకొచ్చారు.
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హయాంలో తెలంగాణ ఆధ్యాత్మికతకు స్వర్గధామంగా మారడంతో పర్యాటకులు విహార యాత్రలకు బదులు ఆధ్యా త్మిక యాత్ర లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సెలవు దినాల్లో రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడటమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ నుంచి బయలుదేరి రెండు రోజుల్లో యాదగిరిగుట్ట, వరంగల్ వేయి స్తంభాలగుడి, కాళేశ్వరం, కొండగట్టు, ధర్మపురి, బాసర, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలుండటంతో చాలామంది సెలవు దినాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలకు మొగ్గు చూపుతున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రోజుకు సగటున 45,000-50,000 మంది భక్తులు దర్శించు కుంటున్నారు.
ధూపదీప నైవేద్య పథకం (డీడీఎన్) కింద 6,271 అర్చకులకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. దీనిద్వారా ప్రభుత్వం ఏటా రూ.75.25 కోట్లు ఖర్చు చేస్తున్నది. 3,500 ఆలయాల్లోని అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నారు. ఈ తరహా పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం. రాష్ట్రంలో 11,000 పైచిలుకు ఆలయాలను డీడీఎన్లో చేర్చాలనే ప్రతిపాదన ఉండగా, దశలవారీగా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మిగతా ఆలయాలకూ వర్తింపజేసే ప్రతిపాదన ఉన్నది.
దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం!
తన్మంత్రం బ్రాహ్మణాధీనం.. బ్రాహ్మణో మమ దేవతా!!
జగత్తు అంతా దైవాధీనం. బ్రాహ్మణుడి నోటి నుంచి వచ్చే మంత్రానికి ఆ దైవం ఆధీనుడై ఉన్నాడు. వేదమంత్రమునెరిగిన బ్రాహ్మణుడూ దైవమేగా?! అని భోజ రామాయణంలోని మొదటి శ్లోకం చెబుతున్నది. దీన్ని అక్షరాలా నమ్మిన నాయకుడు సీఎం కేసీఆర్. అందుకే బ్రాహ్మణ సంక్షేమానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వడమే కాకుండా, ఒక్కో ఆలయానికి ప్రతినెలా రూ.10,000 చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది.
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో ప్రభుత్వం సుమారు తొమ్మిది ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల వ్యయంతో బ్రాహ్మణ సదన్ను నిర్మించింది. ఇందులో బ్రాహ్మణులు సామూహిక కార్యక్రమాలు నిర్వహించుకు నేందుకు ఫంక్షన్హాలు, సమావేశాలకు ఆడిటోరియం, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే బ్రాహ్మణుల తాత్కాలిక వసతి కోసం గదులు, మఠాధిపతులు, పీఠాధిపతుల విడిది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వేద పండితుల గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచింది. అర్హత వయో పరిమితిని 75 ఏండ్ల నుంచి 60 ఏండ్లకు కుదించింది. వేద పాఠశాలల గ్రాంట్ రూ.2 లక్షలను వార్షిక గ్రాంటుగా మార్చింది. 32 వేద పాఠశాలలు, 57 మంది వేద పండితులకు లబ్ధి చేకూరుతున్నది.
అగ్రవర్ణాల్లో నిరుపేదలుగా ఉన్న బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రూ.212 కోట్లు వెచ్చించింది. వీటిద్వారా 7,054 మందికి నేరుగా లబ్ధి చేకూరింది. దేశంలో బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేసి వివిధ పథకాల కింద ఏటా తగినన్ని నిధులు మంజూరు చేస్తున్నదీ సర్కారు. వివిధ శాఖల్లో సమర్థతను నిరూపించుకున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి నేతృత్వంలో విద్యార్థులు, నిరుద్యోగులతోపాటు బ్రాహ్మణ సమాజ అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలను అమలుచేస్తున్నారు. నిరుద్యోగులు స్వయం ఉపాధిని పొందేందుకు ఉద్దేశించిన బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్ ఫర్ తెలంగాణ (బెస్ట్) పథకం, అర్హులైన నిరుపేదలు విదేశీ విద్యను అభ్యసించేందుకు ఉద్దేశించిన వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ఇందులో ముఖ్యమైనవి.