Dharmapuri | జగిత్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మపురి. ఈ క్షేత్రంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి కొలువు దీరిన చోటు. పవిత్ర గోదావరి ఉత్తర, దక్షిణాలుగా ప్రవహించే నేల ఇది. 2009లో జరిగిన పునర్విభజనలో ధర్మపురి నియోజకవర్గాన్ని ఏర్పాటుచేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత 2018లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్పై బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఘనవిజయం సాధించారు. నిజానికి కొప్పుల ఈశ్వర్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు ఏడో సారి బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి కొప్పుల ఈశ్వర్కు పట్టం కట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులతో ధర్మపురి నియోజకవర్గ రూపురేఖలు మారాయి. మంత్రి ఈశ్వర్ అత్యధికంగా నిధులు తెచ్చి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధ్దికి ఈ టర్మ్లోనే దాదాపు రూ.2000 కోట్లు మంజూరు చేయించారు. మండల కేంద్రాల నుంచి ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు, గ్రామాల్లో అంతర్గతంగా సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మింపజేశారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా శుద్ధ్దజలం అందుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలో దాదాపుగా చెరువులన్నింటినీ పునరుద్ధరించారు. రూ. 249 కోట్లు వెచ్చించి గోదావరిపై 13 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. రూ.135 కోట్ల వ్యయంతో పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో దాదాపు 10వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. దీనికి తోడు వరద కాల్వల నుంచి ఎస్సారెస్పీ కాల్వకు లింక్ కెనాల్ తవ్వడంతో పెగడపల్లి మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుతున్నది.
మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించారు.వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 40 కోట్లు మంజూరు చేయించారు. ధర్మపురిని రూ.140 కోట్లతో టెంపుల్ సిటీగా అభివృద్ధ్ది చేస్తున్నారు. రూ.4కోట్లతో ధర్మపురిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించారు. రూ.6 కోట్లతో పట్టణం పరిధిలోని హైవేని నాలుగులైన్ల రహదారిగా విస్తరించారు. కూడళ్లన్నింటినీ సుందరీకరించారు.
ఈ సీజన్లో రైతుబంధు కింద దాదాపు 1.02లక్షల మంది రైతులకు రూ.72కోట్లు ఖాతాల్లో జమయ్యాయి. నియోజకవర్గంలో 400 మంది బీసీలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున అందజేశారు.
మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలో రూ. 45 కోట్లతో 160 చెరువులను ఆధునీకరించారు. ఒకప్పుడు సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు పడ్డ గ్రామాల్లో చెరువులు పునరుద్ధరించడం వల్ల భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లోకి కూడా పుష్కలంగా నీరు చేరింది. దాదాపు ఒకటిన్నర టీఎంసీల నీరు సేద్యానికి అందుబాటులోకి వచ్చింది.
– ధర్మపురి, నమస్తే తెలంగాణ