హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకున్నారు. బిల్లుల పెండింగ్పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దేశవ్యాప్తంగా తమిళిసై పరువు పోయింది. గవర్నర్ హోదాలో ఆమె వ్యవహారంపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో ఆమె కీలుబొమ్మగా మారిన వైనంపై గురువారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. దీంతో తమిళిసైకి ఏం చేయాలో పాలుపోలేదు. బిల్లులను ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాల్సింది పోయి, ప్రభుత్వం తరఫున సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సీఎస్ శాంతికుమారిని లక్ష్యంగా చేసుకొన్నారు. శుద్ధ అబద్ధాలతో వరుస ట్వీట్లు చేసి మరోసారి తన పరువు పోగొట్టుకున్నారు. రాజ్భవన్ను ‘రాహ్భవన్’ అంటూ అక్షరదోషాలతో ట్వీట్ చేయడం మరో విశేషం.
‘ఢిల్లీ కన్నా రాజ్భవన్ చాలా దగ్గర. సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా రాజ్భవన్కు వచ్చి కలిసేందుకు మీకు సమయం దొరుకలేదా?. ప్రొటోకాల్ తెలియదా?. కనీసం మాటవరుసకైనా ఫోన్ చేయలేరా?స్నేహపూర్వక వాతావరణంలో చేసే అధికారిక పర్యటనలు, చర్చలు ఎంతో మేలు చేస్తాయి. కనీసం మీకు ఆ ఉద్దేశం కూడా లేదు’ అని సీఎస్ శాంతికుమారిని ఉద్దేశించి తమిళిసై ట్వీట్ చేశారు. ‘ఢిల్లీ కన్నా రాజ్భవన్ దగ్గరే ఉన్నది అని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను’ అని మరో ట్వీట్ చేశారు.
శాంతికుమారి సీఎస్గా జనవరి 11న బాధ్యతలు స్వీకరించారు. జనవరి 26వ తేదీన రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకలు సీఎస్ పర్యవేక్షణలోనే జరిగాయి. సీఎస్ ఉదయమే వెళ్లి గవర్నర్ను కలిశారు. వేడుకలు పూర్తయ్యే వరకు ఆమెతోనే ఉన్నారు. సాయంత్రం జరిగిన ఎట్ హోం వేడుకల్లోనూ సీఎస్ పాల్గొన్నారు. అంటే, రోజంతా గవర్నర్ పక్కనే సీఎస్ ఉన్నారు. అయి నా తమిళిసై అసత్య ప్రచారం చేస్తూ ట్వీట్ చేశారు.
గవర్నర్ రాజకీయ ట్వీట్పై నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాల్సిందిపోయి రాజకీయ నాయకురాలిలాగా విమర్శలు చేయటం ఏంటని నిలదీశారు. ముందు 10 బిల్లులపై సంతకాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ‘ట్వీట్లు చేస్తూ కాలం వెళ్లదీసే బదులు బిల్లులను పూర్తిగా చదివి.. ఆమోదించండి లేదా తిరస్కరించండి’ అని సూచించారు. ‘బిల్లు పాస్ చేస్తారా.. రాజీనామా చేస్తారా?’ అంటూ మండిపడ్డారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా ఉన్న వ్యక్తి.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసుగా ఉండే సీఎస్ను విమర్శించటం ద్వారా తన పదవి గౌరవాన్ని బజార్లో పడేశారని మండిపడ్డారు. ‘అవసరమా మేడం.. మీ డ్యూటీ మీరు చేయొచ్చుగా. ఎంతో హూందాగా ఉండే గవర్నర్ పోస్ట్కు మీరు మచ్చ తెస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’ అని హితవు పలికారు. ‘వీళ్లు ప్రజల కోసం అని మరిచిపోతున్నారు. బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను ఇంకా కొనసాగిస్తూ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారు’ అంటూ తమిళనాడుకు చెందిన ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘మీకు ఇన్ని నెలలుగా బిల్లులపై సంతకాలు పెట్టేంత సమయం లేకపోతే.. ఆ కాలానికి జీతం తీసుకోకండి’ అంటూ ఓ నెటిజన్ డిమాండ్ చేశారు. ‘మేడం.. బొకేలు, సోంపాపిడి, స్వీట్ బాక్సుల కోసం బిల్లుల మీద సంతకం పెట్టడం ఆపుతారా?’ అని మరో నెటిజన్ ఎద్దేవా చేశారు.
‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా రాజ్భవన్కు రాలేదు. కనీసం ఫోన్కాల్ చేసి మాట్లాడలేదు. ఆ మాత్రం తీరిక దొరకలేదా’
– గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్