Telangana | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. తొమ్మిదేండ్లలోనే అనేక పెద్దరాష్ర్టాలతో పోటీ పడుతూ ఆర్థిక రంగంలో తనకు తిరుగే లేదని చాటిచెప్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా సొంతకాళ్లపై నిలబడున్నది. ఏటికేడు అన్ని రంగాల్లో జోరుగా పురోగమిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో అంచనాలకు తగ్గ రాబడిని సాధించిన తెలంగాణ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మేలో) మొత్తం రూ.20,238 కోట్ల రాబడిని సమకూర్చుకున్న రాష్ట్రం.. ఈ ఏడాది ఇదే సమయంలో ఏకంగా రూ.31,700 కోట్ల రాబడిని సాధించింది. ఇందులో అత్యధికంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రూ.7,430 కోట్లు రాగా.. అమ్మకం పన్ను రూపంలో రూ.2,358 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,358 కోట్లు, ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.2,683 కోట్లు, పన్నేతర రాబడి రూ.891 కోట్లు వచ్చింది.
తెలంగాణ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు మోదీ సర్కారు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్న రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నది. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నది. అర్థం పర్థంలేని కొర్రీలతో నానా అవస్థలు పెడుతున్నది. చివరికి పన్నుల వాటాల్లోనూ కోతలు విధిస్తున్నది. ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్ పరిస్థితి మరీ దారుణం. తొమ్మిదేండ్ల నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ సరిగా ఇవ్వకుండా తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపేణా రూ.41,001 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా.. కేంద్రం రూ.13,087 కోట్లే విదిల్చింది.
ఇది రాష్ట్ర ప్రభుత్వ అంచనాల్లో కేవలం 31 శాతమే. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం అదే వివక్షను కొనసాగిస్తున్నది. ఏప్రిల్లో రాష్ర్టానికి కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేదు. మే నెలలో మొక్కుబడిగా రూ.1,438 కోట్లే ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.41,259 కోట్లు వస్తుందని రాష్ట్రం అంచనా వేయగా.. తొలి నెలల్లో కేవలం 3 శాతమే విదిల్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న మోదీ సరారు.. దేశ ఆర్థిక రంగానికి దన్నుగా నిలుస్తున్న తెలంగాణపై మాత్రం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది.