హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సొంతింటి కల సాకారం కోసం ప్రజలు తమ ఆదాయంలో 77 శాతం వెచ్చిస్తున్నారని రెరా చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ చెప్పారు. దీని ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో గుర్తించాలని సూచించారు. ఫ్లాట్, ప్లాటు కొనుగోలుదారుల హకుల పరిరక్షణకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని కోరా రు. మంగళవారం బేగంపేటలోని గ్రాండ్ కాకతీయ హోటల్లో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ (రెరా) సంయుక్త ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో సత్యనారాయణ మాట్లాడారు. రెరా రిజిస్ట్రేషన్ లేనిదే ప్రకటనల జారీతోపాటు వ్యాపార కార్యక్రమాలు చేయవద్దని స్పష్టంచేశారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వా త నిర్మాణ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నదని తెలిపారు. రెరా చట్టం ద్వారా రియల్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో రెరా సభ్యులు కే శ్రీనివాసరావు, కే లక్ష్మీనారాయణ, క్రైడాయ్ అధ్యక్షుడు రామకృష్ణారావు, సుప్రీంకోర్టు న్యాయవాది హజీద్ సుల్తాన్ అలీ, మేనేజర్ శివకుమార్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్, హైకోర్టు న్యాయవాది (ఆఫ్రా) హరికుమార్, సందీప్, కార్యదర్శి రమేశ్, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.