హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సివిల్ విభాగంలో 1,343 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి ఆది, సోమవారాల్లో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) పద్ధతిలో పరీక్ష జరుగనున్నది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 3న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఏడాది జనవరి 22న ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఏఈఈ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. మళ్లీ కొత్త తేదీలను ప్రకటించింది. ఈ సారి ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. నేపథ్యంలో మొత్తం నాలుగు రోజులు పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మే 8, 9 తేదీల్లో 197 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించింది.