TSPSC Paper Leakage | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంలో చాలా పెద్ద చైన్ లింక్ ఉన్నదని, నిందితులందరినీ మరోసారి విచారించాలని కోరుతూ సిట్ అధికారులు శనివారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితురాలు రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్ ఏఈ పేపర్ను ఆశావహులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారని సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది. తాజాగా మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్కు చెందిన ప్రశాంత్రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రశాంత్రెడ్డి నవాబ్పేట్ మండలం ఉపాధి హామీ పథకంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా డీఆర్డీఏలో పని చేస్తున్న ఢాక్యానాయక్ ప్రశాంత్రెడ్డికి పరిచయమయ్యాడు.
ఈ నెల 5న జరిగిన ఏఈ పేపర్ను రెండ్రోజుల ముందుగానే ప్రశాంత్కు అందించినట్టు తెలుస్తున్నది. మహబూబ్నగర్లోని రేణుక ఇంట్లో ప్రశాంత్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రూ.7.5 లక్షలు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ప్రశాంత్తోపాటు మరో ఐదుగురికి ఏఈ పేపర్ షేర్ చేసినట్టు సిట్ అధికారులకు ఆధారాలు దొరికాయి. మహబూబ్నగర్ ఎంపీడీవో ఆఫీసులో ఇద్దరు ఉద్యోగులు, షాద్నగర్కు చెందిన మరో వ్యక్తి ఏఈ పేపర్లను లక్షల రూపాయలను చెల్లించి కొనుగోలు చేసినట్టు సిట్ అనుమానిస్తున్నది. మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రశాంత్ వాంగ్మూలంతో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నదని స్పష్టమవుతున్నది. తొమ్మిది మంది నిందితులను కస్టడీలో విచారించినప్పుడు ఎవరు కూడా నోరు మెదపలేదని, ఇద్దరు మాత్రమే మరో ఇద్దరి పేర్లు చెప్పారని సిట్ పిటిషన్లో వివరించింది. ఏడుగురు నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్ అధికారులు కోరారు.