Advocate Jalandhar | ఒకప్పుడు ఫేమస్ లాయర్.. కానీ ఆయన జీవితాన్ని కరోనా కుదిపేసింది. కరోనా తర్వాత కేసులు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికితోడు సంతానం లేదనే దిగులు! వీటన్నింటితో మానసికంగా కుంగిపోయిన ఆయన.. కట్టుకున్న భార్యతో కలిసి వేములవాడ రాజన్న చెంతకు చేరాడు. అక్కడే గుడి మెట్ల మీద భిక్షమెత్తుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఇటీవల సిరిసిల్ల కలెక్టర్ ఆదేశాల మేరకు రాజన్న ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కాసర్ల జలంధర్ రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్కు చెందిన శిరీషతో 2006లో వివాహం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్లో జలంధర్ రెడ్డి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ, అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. 2019 వరకు వీరి జీవితం సాఫీగా సాగింది. కరోనా తర్వాత వీరి జీవితం తలకిందులయ్యింది. ప్రాక్టీస్ పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికితోడు శిరీష అనారోగ్యం బారిన పడింది. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. పైగా సంతానం కూడా లేకపోవడంతో ఈ దంపతులు జీవితంపై విరక్తి చెందారు. ఈ క్రమంలోనే అన్నింటినీ వదిలేసి రెండేళ్ల క్రితం శిరీష వేములవాడకు వచ్చేసింది. ఆమెను వెతుక్కుంటూ జలంధర్ కూడా వేములవాడకు వచ్చేశారు. ఇద్దరూ కలిసి రాజన్న ఆలయ పరిసరాల్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. గుడి మెట్లను శుభ్రం చేసుకుంటూ.. భక్తులు ఇచ్చిన వాటితో కడుపు నింపుకుంటున్నారు.
ఇప్పటివరకు తాము ఎవరిని భిక్షం అడగలేదని.. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరైనా కానుకలు ఇస్తే తీసుకుంటామని.. లేకపోతే ఏదైనా పనిచేసుకుంటామని కాసర్ల జలంధర్ తెలిపారు. భిక్షాటన చేసేవాళ్లతో పాటే అధికారులను తమకు కూడా అనాథాశ్రమానికి తీసుకెళ్లారని.. కానీ అక్కడ ఉండటం ఇష్టం లేక మళ్లీ గుడి మెట్ల దగ్గరికే వచ్చేశామని జలంధర్ తెలిపారు. ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపిస్తే రాజన్న గుడి మెట్లను వదిలేసి పనిచేసుకుంటామని పేర్కొన్నారు.