హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీకి ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) క్యాడర్ అధికారుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి తొందర ఎందుకని అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు ప్రశ్నించారు. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు సోమవారం హైకోర్టులో విచారణకు రావడంతో వాటిపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినాలని రామచందర్రావు కోరారు.
దీంతో కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్కుమార్ జోక్యం చేసుకున్నారు. ఏఐఎస్ అధికారుల విభజన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, దానితో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలో క్యాట్కు చెప్పిందని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. దీనిపై రామచందర్రావు స్పందిస్తూ.. విద్యుత్తు బకాయిలు, ఉమ్మడి ఆస్తుల పంపకాలు సహా ఏపీ పునర్విభజనకు సంబంధించిన అనేక వివాదాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఏఐఎస్ అధికారుల కేటాయింపుల వ్యవహారంపై కేంద్రానికి తొందర ఎందుకని ప్రశ్నించారు. దీంతో ఇరుపక్షాలు సమయనం పాటించాలని, రాజకీయాలకు హైకోర్టును వేదికగా వాడుకోవద్దని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.