భీమదేవరపల్లి, జూన్ 24: వరంగల్ అర్బన్ జిల్లాలోని చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి కొండపై గురువారం వరంగల్ జిల్లా పర్యాటక శాఖతో కలిసి 14 మంది సాహస కృత్యాలు చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సముద్రమట్టానికి 2,300 అడుగుల ఎత్తుపై ఉన్న కొత్తకొండ గుట్టపైకి ట్రెక్కింగ్, రాపెల్లింగ్, జుమారి చేస్తూ వెళ్లి శిస్తుబండను చేరుకున్నారు. అతికష్టమైనప్పటికీ అత్యంత సాహసంతో శిస్తుబండను చరిత్రలో మొదటిసారి అధిరోహించి పీవీ సమిట్గా నామకరణం చేశారు. జాతీయ జెండాతోపాటు పీవీ చిత్రపటాన్ని ప్రదర్శించారు. మాడాబి కన్నిబాయి ఆధ్వర్యంలో ఈ సాహస కృత్యాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని సాహస, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు చొల్లేటి శ్రీనివాస్, గైడ్ రాజేందర్, అడ్వంచర్ క్లబ్ ఏసీటీఎస్ ఫౌండర్ రంగారావు, శివకుమార్లాల్ తదితరులు పాల్గొన్నారు.