హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ కూలిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికను అమలుచేస్తున్నది. ఆ కుటుంబాలను గుర్తించి, వివిధ రంగాల్లో 15 నుంచి 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇచ్చి మెరుగైన జీవనోపాధి పొందేందుకు ఆర్థికంగా దారి చూపెడుతున్నది. ఇందుకు ఉన్నతి కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,545 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు సంవత్సరానికి గరిష్ఠంగా 100 రోజులు పని చేసేందుకు అవకాశం ఉన్నది. ఒక కూలీ కుటుంబం వరుసగా మూడేండ్లపాటు 100 రోజులు పనికి వెళ్తే ఆ కుటుంబం పూర్తిగా పేదరికంలో ఉన్నట్టు అంచనా వేసి కుటుంబంలో ఒకరికి శిక్షణ ఇస్తున్నారు.
డెయిరీ నిర్వహణ, వర్మి కంపోస్టు, నర్సరీల నిర్వహణ, ఆర్గానిక్ వ్యవసాయం, టైలరింగ్, మగ్గం వర్క్, అగర్ బత్తీలు, జ్యూట్ బ్యాగ్ల తయారీ, కూరగాయల సాగు, పచ్చళ్లు పెట్టడం, ల్యాండ్ సర్వేయర్, బిస్కెట్ల తయారీ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఉన్నతిలో 15 నుంచి 90 రోజుల వరకు శిక్షణలు ఉంటాయి. వీటిలో కృషి విజ్ఞాన కేంద్రం ఇచ్చే శిక్షణలు 15 రోజులు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎస్ఈటీఐ) ఇచ్చే శిక్షణలు 30 రోజులు, ఇంగ్లిష్ వర్క్ రిడ్నెస్ అండ్ కంప్యూటర్(ఈడబ్ల్యుఆర్సీ), న్యాక్ ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణలు 90 రోజులపాటు ఉంటాయి. శిక్షణకు కనీసం ఏడో తరగతి చదివి ఉండాలి. ఆపై చదివిన వారికి విద్యార్హతల ఆధారంగా శిక్షణ ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. ఉచిత శిక్షణ పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడి జీవనోపాధి పొందుతున్నారు.