కోటి ఎకరాల మాగాణమైన తెలంగాణ.. రెండు కోట్ల టన్నుల ధాన్యం సిరుల తెలంగాణగా మారుతున్నది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 2.28 కోట్ల టన్నుల ధాన్యసిరులు పండనున్నాయని అంచనా. రెండుకోట్ల టన్నులకుపైగా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ.. పంజాబ్ సరసన నిలువనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపోయే దిగుబడి కూడా లేని స్థితి నుంచి.. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదగడం వెనుక సీఎం కేసీఆర్ అకుంటిత దీక్షతో తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు కేంద్రీకృత పథకాలు ఉన్నాయనేది వాస్తవం.
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పొలాల్లో ధాన్యం సిరులు పండుతున్నాయి. ఒకప్పుడు లక్షల టన్నుల్లో ఉండే ఉత్పత్తి.. ఇప్పుడు కోట్ల టన్నులకు చేరింది. ఈ ఏడాది వానకాలం, యాసంగి కలిపి 2.28కోట్ల టన్నుల రికార్డుస్థాయి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రెండుకోట్ల టన్నులు దాటడం ఇదే ప్రథమం. వానకాలం సీజన్లో 90 లక్షల టన్నులకుపైగా ధాన్యం ఉత్పత్తి కాగా.. ఈ యాసంగిలో 1.38 కోట్ల టన్నులు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది.
వానకాలం ధాన్యంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యం లో 48.85లక్షల టన్నులు కొనుగోలు చేయగా.. మిల్ల ర్లు సొంతంగా 40-45 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు అంచనా. ఈ యాసంగిలో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఎఫ్సీఐ టార్గెట్గా పెట్టుకున్నది. యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగుతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వానకాలంతో పోల్చితే యాసంగిలో సమానం గా వరి సాగయింది.
వానకాలంలో సాగైన 53.74 ఎకరాలతో కలిపి ఈ ఏడాది వరిసాగు కోటి ఎకరాలు దాటింది. 2014-15లో తెలంగాణలో కేవలం 34.97లక్షల ఎకరాల్లోనే వరి నాట్లు వేశారు. ఇందులో వానకాలంలో 22.74 లక్షల ఎకరాలు ఉండగా.. యాసంగిలో 12.23 లక్షల ఎకరాల్లో సాగైంది. 2014-15లో పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసిన ధాన్యం 24.28 లక్షల టన్నులు మాత్రమే కాగా.. 2019-20లో 1.11 కోట్ల టన్నులు సేకరించింది.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. పంజాబ్తో సమానంగా నిలుస్తున్నది. ఒక ఏడాదిలో 2 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ర్టాలు దేశంలో ఈ రెండు రాష్ర్టాలు మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత హర్యాన, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలు ఉన్నాయి.
ఇది తెలంగాణ రైతు విజయం
రికార్డుస్థాయిలో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి కావడం తెలంగాణ రైతు సాధించిన విజయం. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలే.. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, రైతులను మేటిగా నిలిపాయి. సాగులో వానకాలం, యాసంగి పోటీపడటం, కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావడం హర్షణీయం.
నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
తెలంగాణలో ఒకే ఏడాదిలో 2 కోట్ల టన్నులకుపైగా ధాన్యం ఉత్పత్తి కావడం అద్భుతమని చెప్పవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసిన ధాన్యం 24 లక్షల టన్నులు మాత్రమే. కానీ, ఈ యాసంగిలోనే 80 లక్షల టన్నులు టార్గెట్గా పెట్టుకున్నాం. తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి ఇది అద్దం పడుతున్నది.
మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్