OU Convocation | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 31న నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుందని చెప్పారు. అడోబ్ సీఈవో శాంతను నారాయణ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఓయూ గెస్ట్హౌజ్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములుతో కలిసి వీసీ మాట్లాడారు.
ఓయూ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా శాంతను నారాయణ్ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని వెలువరిస్తారని తెలిపారు. ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న 49వ వ్యక్తిగా శాంతను నారాయణ్ నిలుస్తారని చెప్పారు. ఇప్పటి వరకు లా విభాగంలో 30, సాహిత్యంలో 12, సైన్స్లో 6 గౌరవ డాక్టరేట్లను ఓయూ ప్రదానం చేసిందని గుర్తు చేశారు. వారిలో 18 మంది ప్రముఖ వ్యక్తులు, ఎనిమిది మంది రాజకుటుంబీకులు, ఆరుగురు విదేశీ ప్రముఖులు, నలుగురు జాతీయ నాయకులు, ఐదుగురు న్యాయమూర్తులు, ముగ్గురు రాష్ట్రపతులు, ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు కవులు ఉన్నారని వివరించారు.
జూలై 2021 నుంచి జూలై 2022 వరకు వివిధ కోర్సులు పాసైన వారికి బంగారు పతకాలు ప్రదానం చేస్తామన్నారు. 2022 ఆగస్టు 6వ తేదీ నుంచి 2023 అక్టోబర్ 10వ తేదీ వరకు పరీక్షలు పాసైన వారికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేస్తామన్నారు. మొత్తం 57 బంగారు పతకాలను 45 మంది విద్యార్థులు గెలుచుకున్నారని, వారిలో ఆరుగురు అబ్బాయిలు కాగా, 39 మంది అమ్మాయిలు కావడం విశేషమన్నారు. 979 మంది పీహెచ్డీ పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 608 మంది పురుషులు కాగా, 371 మంది మహిళలని పేర్కొన్నారు. అత్యధికంగా 272 మంది ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ నుంచి, 189 మంది ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారన్నారు.