హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ర్యాంకుల ద్వారా భర్తీ చేస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలకు నీట్ యూజీ ర్యాంకులను పరిగణనలోకి తీసుకొంటామని వెల్లడించింది. నర్సింగ్ అడ్మిషన్లు పొందాలనుకొనే అభ్యర్థులు ఎంసెట్తోపాటు నీట్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ సీట్లను ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.