హైదరాబాద్: విద్యావ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా సమయంలో టీచర్లు చేసిన కృషిని సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకులాలు ఏర్పాటుచేసి ఉచిత విద్య అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు రావాల్సిన నిధులు కూడా రాకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని చెప్పారు. విద్యారంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. విద్యాశాఖ నిధులు కూడా విడుదల కావడంలేదంటే మన రాష్ట్రంపై కేంద్రానికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.