హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్రవేశాల జోరు కొనసాగుతున్నది. 91 వేలకుపైగా చిన్నారులు సర్కార్ బడుల్లో చేరారు. సర్కార్ బడుల్లో నమోదు పెంచేందుకు ఈ నెల 3న ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో నాలుగురోజుల్లోనే లక్షకు చేరువలో ప్రవేశాలు నమోదయ్యాయి. తొలిరోజు శనివారం 10వేల మంది చిన్నారులు చేరగా, సోమవారం ఏకంగా 30 వేల మంది, మంగళవారం 25 వేల మంది, బుధవారం 23వేలమందికిపైగా చిన్నారులు ప్రవేశాలు పొందారు. ఈ నెల 9 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్, 17 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.