హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వరంగల్లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్ అండ్ బీ ఈఎన్సీ, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ, డీఎంఈ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ను హెల్త్సిటీగా మార్చేందుకు కేంద్ర కారాగారం స్థలంలో రూ.1,100 కోట్లతో అత్యాధునిక దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. ఈ దవాఖాన నిర్మాణం పూర్తయితే ఉమ్మడి వరంగల్తోపాటు పొరుగు జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానున్నది. సుమారు 60 ఎకరాల్లో 24 అంతస్థుల్లో ఈ దవాఖానను నిర్మించనున్నారు. 2 వేల పడకలు, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. దవాఖాన నిర్మాణానికి జూన్ 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దవాఖాన నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు. దవాఖానలో అత్యాధునిక సదుపాయాలు, మెడికల్ కాలేజీ ఉంటాయని హరీశ్రావు ట్వీట్ చేశారు. దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయడమేకాకుండా, ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు.