మంచిర్యాల, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాందేడ్ సమావేశం నేపథ్యంలో మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పేరు మార్మోగిపోతున్నది. తెలంగాణ సరిహద్దులో ఉన్న సిరోంచ, ఐరి తాలూకా కేంద్రాలతో పాటు ఆళ్లపల్లి పట్టణా ల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గంలో ఆదివాసీ విద్యార్థి సంఘటన పార్టీ మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం ఆదివారం బీఆర్ఎస్లో చేరనున్నారు. సుమారు 500 మంది నాయకులతో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. గడ్చిరోలి జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల్లో ముఖ్య నాయకులు చాలా మంది సమావేశంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.