హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆదివాసీ, గిరిజన బిడ్డల బతుకులు బాగు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని హైదరాబాద్లోని సంక్షేమభవన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. గుస్సాడీ, కోయ, బంజారా నృత్యాలు అలరించాయి. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీగూడేల్లో విద్య, వైద్యం, తాగునీరు, వి ద్యుత్తు వంటి మౌలిక వసతుల కోసం ప్రభు త్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. స్వయం పాలనలో భాగస్వాములను చేసే దిశగా ఆదివాసీగూడేలను, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఆదివాసీగోండు గూడేలకు మిషన్భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని గుర్తుచేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ ఆవాసాలకు 3 ఫేజ్ కరెంటు ఇస్తున్నామని వెల్లడించారు. అడవి బిడ్డల విద్యకోసం ఎస్టీ గురుకులాలను ఏర్పాటుచేసి అంతర్జాతీయస్థాయి విద్యను టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.
ఒప్పందాలపై సంతకాలు
గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు ఫలవంతంగా ఉండేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్, రాజేంద్రనగర్తో ఆ శాఖ ఒప్పందాలు కుదుర్చుకొన్నది. ఆదిమ గిరిజన తెగలైన చెంచు, కొలాం, థోటి, కొండ్రెడ్డి కుటుంబాల ఆరోగ్య పోషణ, జీవనోపాధి కోసం డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్, రాజేంద్రనగర్తో పెరటి తోటల్లో కోళ్ల పెంపకంపై ఒప్పందం జరిగింది. ఆ సంస్థ ఇన్చార్జి డైరెక్టర్ ఎంవీఎల్ఎన్ రాజు ఒప్పందంపై సంతకం చేశారు. సీఎంఎస్టీఈ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 100 మంది ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సామర్థ్య నిర్వహణ, వ్యాపార మెళకువలలో శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ రాజనందిని ఒప్పంద పత్రాలపై సంతకాలుచేశారు.
గిరిజన సంక్షేమశాఖ తరఫున కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆదిమ గిరిజన తెగల కుటుంబాలకు ఒకో కుటుంబానికి 20 కోళ్ల చొప్పున ఐటీడీఏ ద్వారా ఉచితంగా ఇస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అనంతరం రాజేంద్రనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐఐటీ స్టడీ సెంటర్లో చదివిన విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన కాలేజీలలో సీట్లు సాధించిన విద్యార్థులను మంత్రి సత్కరించి నగదు పురస్కారాలు అందజేశా రు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ రమావత్ వాల్యా నాయక్, గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కనకరాజు, సకిని రామచంద్రయ్య, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.