పరభాషా నాయికలు తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇప్పుడు మామూలు విషయంగా మారింది. నిత్యామీనన్, సమంత, రాశీఖన్నా వంటి అగ్ర తారలు తెలుగులో ఓన్ డబ్బింగ్తో ప్రేక్షకుల్ని మెప్పించారు. సొంత గొంతు వల్లే తమ పాత్రలకు సహజత్వం వస్తుందని చాలా మంది నాయికలు నమ్ముతున్నారు. తాజాగా వారి బాటలో అడుగులు వేయనుంది గ్లోబల్స్టార్ ప్రియాంకచోప్రా. ‘వారణాసి’ చిత్రంలో ఈ భామ సొంత గొంతును వినిపించబోతున్నదని ఫిల్మ్నగర్ టాక్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఓవైపు షూటింగ్తో పాటు సమాంతరంగా పోస్ట్ప్రొడక్షన్ వర్క్ని కూడా పూర్తిచేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ నేపథ్యంలో సొంత డబ్బింగ్ కోసం ప్రియాంకచోప్రా సిద్ధమవుతున్నదని, ఓ ట్యూటర్ సహాయంతో తెలుగుపై పట్టుసాధించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నదని తెలిసింది. దర్శకుడు రాజమౌళి సైతం ప్రియాంకచోప్రాను ఓన్ డబ్బింగ్ కోసం ప్రోత్సహిస్తున్నారట. అన్నీ కుదిరితే ఆమెతోనే డబ్బింగ్ చెప్పించే ఛాన్స్ ఉందని ఇన్సైడ్ టాక్. ‘వారణాసి’ చిత్రంలో మందానికి అనే పాత్రలో ప్రియాంకచోప్రా కనిపించనుంది.