1994 మే నెల అనుకుంటా.. సూర్యుడు నడినెత్తిమీద కూసున్నడు.. పగటీలి ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం ఇట్ల తిని చెయ్యి కడిగిన్నో లేదో.. మా సార్ ‘ఏ యాదగిరి, శ్యామ్లాల్ బిల్డింగ్స్ ఏరియా నుంచి ఒక్కటే మొకాన ఫోన్ మోగుతున్నది, చాంబర్ జామ్ అయిందట.. జల్దీ పోవయా..’ అంటే ఆ ఏరియాకు పోయి జామ్ అయిన ఇంటి బెల్లు కొట్టిన. తలుపు తీసి నన్ను చూసిన ఓనరమ్మ రెండడుగులు ఎన్కకేసింది. ముక్కుకు కొంగడ్డం పెట్టుకొని జామ్ అయిన చాంబర్ సూపెట్టింది. చాంబర్ మూత తీసి చూస్తే మలం మొత్తం పేర్కపోయి మీదనే కనవడుతున్నది. మోకాళ్ల మీద కూసొని జబ్బల మందం
చెయ్యి ఆ చాంబర్ల వెట్టి (అప్పుడు ఇప్పట్లెక్క గ్లౌజులు గిన లెవ్వు) తట్టుకున్నయి తీసి చూస్తే అన్ని బట్ట పేగులే. ఆ బట్ట పేగులు ఎర్రటి రంగులో ఉన్నయి. వాటి దంటకు ప్లాస్టిక్ బుగ్గలు, ఎంటికలు అన్ని మలెగట్టి ఒక్కకాడ కూడినయి. అవి ఇట్ల తీసిన్నో లేదో చాంబర్ల జమైన నీళ్లన్నీ సుక్క లేకుండా జారిపోయినయి. ఆ ఓనరమ్మను చెయ్యిల మీద కొన్ని నీళ్లు పొయ్యిమంటే బకెట్ల నీళ్లు తెచ్చి ఆ మూలకు వెట్టి జప్పున లోపటికి పోయింది. చెయ్యిలు కడుక్కొని ‘అమ్మా..
అన్నం తిన్నంక నీళ్లు తాగుడు మర్సిపోయిన కొన్ని నీళ్లియ్యమ్మా’ అంటే.. మీదికెళ్లి దోసిట్ల నీళ్లు జారిడిసింది కనీ, గిలాస మాత్రం
చేతికియ్యలె. మంది మలమూత్రాలైతే అయింత ఈ నీళ్లు కూడా పోస్తుండెనో లేదోనని మనసులనుకొని అక్కడి నుంచి బైలెల్లిన.
హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన నా పేరు రాగి యాదగిరి. 1970ల నాలుగో నెల పదో తారీఖున పుట్టిన. నిరుపేద మాదిగ బిడ్డను. పదో తరగతి దాన్క సదివిన గని ఫేలయిన. రెక్కాడితె గని డొక్కాడని జీవితం. గతికి లేక సిటీలనే సిమెంట్ గోలాలు చేసే పనికి కుదిరిన. ఒక్కలం బత్కుడే కట్టంరా నాయినా అంటే 1987ల నాకు పెండ్లి చేసిండు మా అయ్య హన్మంతు. సిటీలో సఫాయి పనిచేసే ఒక సుట్టం పిలిస్తే 1989ల జలమండలిల సఫాయి కార్మికునిగ చేరిన. చెయ్యంగ చెయ్యంగ అదే పర్మెంట్ అయితదని ఆశ చెప్పిండు ఆ పెద్దమనిషి. చేరినప్పుడు నాకు రోజు కూలీ 10 రూపాలు.
అప్పట్లో ఓ చేదు గ్యాపకం. సీబీఎస్ బస్టాండ్ దగ్గర మ్యాన్హోల్లో దిగిన ఓ సఫాయి కార్మికుడు ఊపిరాడక సచ్చిపోయిండు. ఆ వార్త తెలువంగనే తెల్లారి నుంచే సఫాయి పని బంజేద్దామనుకున్న. కనీ కడుపున పుట్టిన నలుగురు కొడుకులు గుర్తుకొచ్చిర్రు. ఇగ బంజేసుడు నాతోటి కాలే. వాల్లను బతికించుకునేందుకైనా సఫాయి పన్జెయ్యాల్సి వస్తున్నది.
ఇరువై ఏండ్లు నౌకరి చేస్తే నా జీతం 12 వేలయింది. 2013లో హరీశ్రావు (ఇప్పటి మంత్రి, అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే) తోని కామ్గార్ యూనియన్ ఏర్పడ్డది. యూనియన్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మన యూనియన్ను గెలిపియ్యాలని ఓ మీటింగుకు అచ్చిండు. ఆ మీటింగుల ‘మన యూనియన్ గెలిస్తే టెంపర్వరీగా చేసే సఫాయిలందర్ని పర్మెంట్ చేపిస్తా. చేపించుడే కాదు, ఆర్డర్ కాపీతో పాటు, పతొక్కలికి హైదరాబాద్ బిర్యానీ తినిపించి, చాయ తాగించి పంపిస్తనని’ మాటిచ్చిండు. 2014 జూన్ 2న తెలంగాణొచ్చింది. జూన్ 23న పర్మెంటయినట్టు ఆర్డర్ కాపీ మా చేతిలకచ్చింది. నాకే కాదు, నా అసొంటి 511 మంది కల నెరవేరింది. హరీశ్రావు ఇచ్చిన మాట ప్రకారం హైద్రాబాద్ బిర్యానీ తినిపించి, చాయ తాగిపించిండు.
పట్నంల ఓ సఫాయి కార్మికుడు మ్యాన్హోల్ల దిగుతున్నప్పుడు మంత్రి కేటీఆర్ సూసిండు. చెయ్యివట్టి ఆ సఫాయి కార్మికునితో ‘మ్యాన్హోల్లో మీరు దిగొద్దు, మీకు కావాల్సిన అతారెలు అప్పజెప్త’మని మాటిచ్చిండు. అప్పటినుంచి చాంబర్లు, మ్యాన్హోల్స్ క్లీన్ చెయ్యడానికి పెద్ద పెద్ద ఏర్ చెక్ బండ్లచ్చినయి. పిట్ట పారలొచ్చినయి. మా చేతులకు గ్లౌజులొచ్చినయి. నెలకు నాలుగు లైబాయ్ సబ్బులొస్తున్నయి. నెలకు కిల పల్లినూనె అస్తున్నది. ఆ పల్లి నూనె చెయ్యిలకు రాసుకొని మ్యాన్హోల్ల పనిచేస్తున్నప్పుడు ఏమన్న మలినాలు ఉంటే పట్టుకోవు. పిట్ట పారలతోని మ్యాన్హోల్స్ క్లీన్ చేస్తున్నం గని, మా చెయ్యిలు పెడ్తలేం. అప్పుడు నీళ్లడిగితే గిలాస చెయ్యిల వెట్టరాయె. ఇప్పుడు మేమే మిన్రల్ బాటిళ్ల నీళ్లు తెచ్చుకుంటున్నం.
ఇప్పుడు నెలకు 28 వేల రూపాల జీతమొస్తున్నది. మొన్న కరోనా అచ్చినప్పుడు పోలీసులు, డాక్టర్లతోటి సమానంగ మేంగూడా 24 గంటలు పన్జేస్తిమి. మా కష్టాన్ని ఉత్తగపోనియ్యలే కేసీఆర్ సార్. నెలకు 7,500ల లెక్కన రెన్నెల్ల జీతం ఎక్కువిచ్చిండు. మాకు గౌరవం తెప్పించిండు. ఆయన సల్లగ బత్కాలె.
– గడ్డం సతీష్, 99590 59041