ఎదులాపురం, జనవరి 19 : ఆదిలాబాద్ – ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని రైల్వేలైన్ సాధన కమిటీ చైర్మన్ కాసవేణి నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం సమీపంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాలుగో రోజుకు చేరుకున్నది. దీక్షా స్థలం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాత జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాసవేణి నారాయణ మాట్లాడుతూ.. ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వేలైన్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అని పేర్కొన్నారు. ఈ రైల్వేలైన్ పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో సాధన కమిటీ నాయకులు నిమ్మల నరేందర్, సిర్ర దేవేందర్, చిల్క దేవిదాస్ పాల్గొన్నారు.