హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలోని అటవీప్రాంతాలు, పలు రకాల జంతువుల ఆకృతులు, వివిధ రకాల కర్రలు, నేలల రకాలు, రూపాలు, జంతువుల పాదముద్రలు ఇలా అన్నీ ఒకేచోట చూసేలా అటవీకళాశాలలో మ్యూజియం ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రం (ఎఫ్ఆర్సీఐ)లో ఏర్పాటుచేసిన మ్యూజియంను ఆకర్షణీయంగా, అర్థవంతంగా మలిచారు. 52 ఎకరాల్లో ఏర్పాటుచేసిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో బీఎస్సీ ఫారెస్ట్ నాలుగేండ్లు, ఎమ్మెస్సీ ఫారెస్ట్ రెండేండ్ల కోర్సులు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు రెండేండ్లపాటు అడవులను సందర్శించి వీటిని సేకరించారు. ప్రజలకు దేశంలో అటవీప్రాంతాలు, నేలల రకాలపై అవగాహన కోసం మ్యూజియంగా మలిచారు. మ్యూజియానికి వెళ్లగానే అడవిలోకి వెళ్లినట్టుగా ఉండేలా వివిధ రకాల జంతువుల బొమ్మలు, చెట్లను ఏర్పాటుచేశారు.
భూములు.. అడవులు
మ్యూజియంలో ఎన్నో అంశాలు తెలుసుకునేలా ఏర్పాటుచేశారు. దేశంలో భూము లు, పంటల రకాలు, రాష్ట్రంలోని అడవుల గురించి తెలిసేలా చిత్రాలను ఉంచారు. తడి ఆకులు, పొడి ఆకురాల్చు, ముండ్ల అడవులు, పొడి సతత హరితారణ్యాలకు సంబంధించి వాటి స్వరూపాన్ని తెలిపే అంశాలున్నాయి. రాష్ట్ర వృ క్షం జమ్మి, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పుష్పం తంగేడు, రాష్ట్ర పక్షి పాలపిట్టలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు చిత్రాలను ఏర్పాటుచేశారు. శిల్పాలు, ఖనిజాలు, శిలాజాలు, మృత్తికలు చిత్రరూపంలో ఉన్నాయి.
జంతువుల పాదాల అచ్చులు
ఏ జంతువు పాదం అచ్చు ఏ విధంగా ఉంటుందో ఫొటోలతో ఏర్పాటుచేశారు. జింక, పులి, నీటి ఏనుగు, సింహం, చిరుత, ఎలుగుబంటి, నక, ఏనుగుల పాదాల అచ్చులను సమకూర్చారు. కప్పకు సంబంధించిన లైఫ్ సరిల్ను ఫొటోల రూపం అలంకరించారు. 32 రకాల సీతాకోక చిలుకలు, 10 రకాల గొల్లభామలు, మిడతలు, తేనెటీగల చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి.
నేలల రకాలు
భూమి లోపల ఎన్ని పొరలు ఉంటాయి? ఏవిధంగా ఉంటాయో చాలామందికి తెలియదు. అందరికీ తెలిసేలా ఫారెస్ట్ కళాశాలలో సాయిల్ ప్రొఫైల్ ఏర్పాటుచేశారు. భూమిలో ఐదు పొరలు ఉంటాయి. అవి ఆర్గానిక్ ఆరిజన్, టాప్ సాయిల్, సబ్ సాయిల్, రాక్ ప్రాంగ్మెంట్స్, బెడ్ రాక్. వీటి గురించి అందరికీ అర్థమయ్యేలా గాజుపాత్రలో రూపొందించారు.
వీటి సేకరణకు రెండేండ్లు పట్టింది
డాక్టర్ కపిల్ సిహాద్తోపాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లు రెండేండ్లపాటు తెలంగాణలోని అన్ని అటవీ ప్రాంతాల నుంచి వీటిని సేకరించారు. దేశంలో, రాష్ట్రంలో అటవీప్రాంతాలు, వివిధ రకాల కర్రలు, జంతువులు, నేలల రకాల గురించి అందరికీ తెలిపేందుకే ఈ మ్యూజియం ఏర్పాటుచేశాం. పాఠశాల విద్యార్థులు ప్రతి నెలా ఫీల్డ్ విజిట్కు వెళ్తుంటారు. అలా వెళ్లేవారు ఎఫ్సీఆర్ఐలో ఉన్న మ్యూజియంను సందర్శిస్తే ఇకడ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.
– వెంకటేశ్వర్లు, డీఎఫ్వో