హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి 100 కంపెనీల పోలీస్ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. ఒకో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్ తదితర బలగాలకు చెందిన 60-80 మంది వరకు సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ ఈ బలగాలను రాష్ట్రానికి పంపినట్టు శాంతిభద్రల విభాగం ఏడీజీ సంజయ్కుమార్ జైన్ వెల్లడించారు. ఈ బలగాను కమిషనరేట్లు, జిల్లాలవారీగా పంపిణీ చేస్తున్నామని, తొలు త సమస్యాత్మక ప్రాంతాలకు పంపిస్తామని ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని బందోబస్తు నిర్వహించే ఈ బలగాలు కీలక ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను, సరిహద్దుల్లో తాతాలిక కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాయని, ఓటర్లలో భయాన్ని తొలగించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పలుమార్లు కవాతు (ఫ్లాగ్ మార్చ్) నిర్వహిస్తాయని వివరించారు.
ప్రస్తుతం రాష్ర్టానికి చేరుకున్న 100 కంపెనీల బలగాలు కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సొంతగా, మరికొన్ని కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో కలిసి విధులు నిర్వహించనున్నాయి. ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాలు కూడా కేంద్ర బలగాల అధీనంలోనే ఉంటాయి. ఎన్నికలకు ముందు ఈవీఎంలను కేంద్రాలకు తీసుకెళ్లడం.. స్ట్రాంగ్ రూ ములకు తేవడం కేంద్ర బలగాల ఆధ్వర్యంలో నే జరుగుతుంది. ఈ బలగాలు డబ్బు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టే తనిఖీల్లోనూ పాలుపంచుకుంటాయి. కాగా, ఈసారి ఎన్నికలకు శిక్షణలో ఉన్న ఎస్సై అభ్యర్థులను కూడా తాత్కాలికంగా విధుల్లోకి తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.