హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై, నియామక పత్రాలు అందుకొన్న వారికి ఈ నెల 21 నుంచి అధికారికంగా శిక్షణ ప్రారంభంకానున్నట్టు పోలీస్ ట్రైనింగ్ విభాగం ఐజీ, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ ఏడీజీ అభిలాష బిస్త్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
పోలీసు అకాడమీతో కలిపి.. మొత్తం 28 కేంద్రాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు టీఎస్ఎఎస్పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు (పీటీసీలు), జిల్లా శిక్షణ కేంద్రాలు(డీటీసీలు), నగర శిక్షణ కేంద్రాలు (సీటీసీలు) ఇందుకు సిద్ధమయ్యాయని ఆమె వివరించారు. రాష్ట్రంలోని 11వేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు ఆయా కేంద్రాల్లో వసతులు ఉండటంతో.. మొదటిదశలో 9,333 మందికి శిక్షణ ఇస్తామని వివరించారు.
మిగిలిన వారి శిక్షణకు సంబంధించిన వివరాలు, తేదీలతో సహా త్వరలోనే వివరిస్తామని తెలిపారు. శిక్షణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పోలీసు అకాడమీలో ఇ ప్పటికే 500 మం దికి పై గా ఎస్సైలు శిక్షణలో ఉం డగా.. మరో 653 మం ది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ పీటీసీలో 1000 మంది సివిల్, మేడ్చల్ పీటీసీలో 400 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏడీజీ అభిలాష బిస్త్ తెలిపారు. మహిళలకు అసౌకర్యం లేకుండా.. మౌలిక వసతులు పూర్తిస్థాయిలో సమకూర్చినట్టు తెలిపారు.
అవుట్, ఇండోర్లలో కొత్త కోర్సులు
కొత్తగా పోలీసు ఉద్యోగ బాధ్యతలు తీసుకొనే వారికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థ శిక్షణ అందించేందుకు ఇం డోర్, అవుట్డోర్లలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు అభిలాష బిస్త్ వెల్లడించారు. ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణకు, నార్కోటిక్ కేసుల నియంత్రణకు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు. స్విమ్మింగ్, డ్రైవింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్సనల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ వంటి కొత్త కోర్సులను తెస్తున్నట్టు చెప్పారు. ప్రతి 30 మంది బ్యాచ్కు హెడ్కానిస్టేబుల్, ఆర్ఎస్సై అందుబాటులో ఉంటారని, శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్టు వెల్లడించారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణను వీరితో పాటే మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది.