ADE Ambedkar | హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపట్టి.. ఆస్తుల వివరాలు సేకరించారు. అంబేద్కర్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
ఏడీఈ అంబేద్కర్ కోట్లకు పడగలెత్తినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో జీ ప్లస్ 5 భవనం, పది ఎకరాల్లో అమ్తర్ కెమికల్స్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో ఆరు రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్స్, ఒక వ్యవసాయ క్షేత్రం, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇక అంబేద్కర్ బినామీ ఇంట్లో రూ. 2.18 కోట్ల నగదు పట్టుబడింది.