హైదరాబాద్: సిటీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. జంటనగరాల్లో బస్ చార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి ఏకంగా రూ.10 పెంచి పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని సీఎం నిర్ణయించారని ధ్వజమెత్తారు. చార్జీల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు రూ.500 అదనపు భారం పడుతుందని చెంపారు. బడుగు జీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస చార్జీపై 50 శాతం ధర పెంచడం అసమర్థ విధానాలకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
‘సిటీ బస్సు చార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి.
ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనం. రాజధానివాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని గట్టెక్కించాల్సిందిపోయి, సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిది.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.