హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాలు చాలా ప్రమాదకరమైనవని, వాటికి అలవాటుపడితే జీవితం నాశనమవుతుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ను మాదకద్రవ్యాలు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న సిటీ పోలీసులు గురువారం బేగంపేటలోని క్లాసిక్గార్డెన్లో అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న యువత మత్తు పదార్థాల వైపు మళ్లకుండా సీఎం కేసీఆర్ మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు అమ్మేవారితో పాటు కొనేవారు కూడా నేరస్థులవుతారని చెప్పారు. పిల్లలు వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చిందని, డ్రగ్స్ కల్చర్ను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, క్రీడాకారిణి నైనా జైస్వాల్, సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి, చిత్ర దర్శకుడు కొరటాల శివ, గాయకులు శ్రీరామచంద్ర, రాహుల్ సిప్లిగంజ్, నటుడు శ్రీనివాస్రెడ్డి, సైకాలజిస్ట్ విరించి శర్మ, డీసీపీ చందనా దీప్తి తదితరులు పాల్గొన్నారు.