హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్కు ఎల్ఐసీ, ఎస్బీఐ ఇచ్చిన రుణాల్లో 67% డబ్బులు సీపీఎస్ ఉద్యోగులకు చెందినవే ఉన్నాయని, అదానీ అప్పు సీపీఎస్ ఉద్యోగుల పాలిట ముప్పుగా పరిణమించిందని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆందోళన వ్యక్తంచేశారు. హెడ్జ్ఫండ్ హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో సంస్థ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకు సీపీఎస్ ఉద్యోగుల సొమ్మును వాడుకుంటారో లేక ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.
పీఎఫ్ఆర్డీ నియమించిన ఫండ్ మేనేజర్లలో ఎల్ఐసీ పెన్షన్ఫండ్, ఎస్బీఐ పెన్షన్ఫండ్లు భాగమేనని చెప్పారు. ఇందులో సీపీఎస్ ఉద్యోగులు చెల్లించే వాటాలు ఉన్నాయని, ఎల్ఐసీలో 33%, ఎస్బీఐలో 34% పెట్టుబడులు ఉన్నాయని వివరించారు. అదానీ గ్రూప్ స్టాక్స్లో ఎల్ఐసీ రూ.77 వేల కోట్లు, ఎస్బీఐ రూ.80 వేల కోట్ల్ల పెట్టుబడులు పెట్టడంతో దేశవ్యాప్తంగా 84 లక్షల ఉద్యోగుల సొమ్ములు ఆవిరైపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండురోజుల్లో స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయిన రూ.4 లక్షల కోట్లల్లో ఎల్ఐసీవి రూ.18 వేల కోట్లు, ఎస్బీఐవి రూ.54 వేల కోట్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కార్పొరేట్ కమీషన్ల కోసమే సీపీఎస్ ఉద్యోగుల డబ్బులను మళ్లించడంలో ఎవరి అండదండలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా కేంద్రం స్టాక్ మారెట్లో ఉద్యోగి భవిష్యత్తు భద్రతకు భరోసా ఇవ్వలేని సీపీఎస్ స్కీంను రద్దుచేసి పాత పెన్షన్ స్కీంను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శ్రీకాంత్, కోశాధికారి నరేశ్గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూరాకుల శ్రీనివాస్, మ్యాన పవన్కుమార్, లింగమూర్తి, దర్శన్గౌడ్, రోషన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.