హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీశైలం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీశైలం నగరంలోని సారంగాపూర్ డెయిరీ ఫామ్ వద్ద డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెయిరీ డెవలప్మెంట్ శాఖ కార్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ క్రమంలోనే జీవితంపైనే వరక్తి చెందిన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశారు. గతేడాది ఆయన వరంగల్ నుంచి నిజామాబాద్కు బదిలీపై వచ్చారు.
బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఆయన.. అందరి యోగక్షేమాలను తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీశైలంపై అనుమానంతో కొడుకులు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని, దిగులు పెట్టుకోవద్దని తండ్రికి సూచించారు. అయితే, తండ్రి మాట్లాడిన తీరుపై అనుమానంతో కొడుకు రవితేజతో పాటు కుటుంబీకులు నిజామాబాద్కు బయలుదేరి వచ్చారు. కార్యాలయం తలుపు పగులగొట్టి చూడగా.. అప్పటికే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో రాశారు. ఏడీ కుటుంబం ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.