హైదరాబాద్: ప్రకృతిని అర్థం చేసుకుంటే ప్రపంచంలో సమస్యలే ఉండవని బాలీవుడ్ నటి రాశిప్రభ సందీపని (Rashiprabha Sandeepani) అన్నారు. సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్లో (Green India Challenge) పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. తాను పుట్టిపెరిగిన శ్రీలంకలో ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే.. ఇప్పటికీ నదులు, అడవులు సురక్షితంగా ఉన్నాయన్నారు. వాటివల్లే శ్రీలంకకు టూరిజం పెరిగి లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు తగ్గాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని తెలిపారు.
ఇందులో భాగంగానే ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh Kumar) ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అనే కార్యక్రమం ప్రారంభించడం.. ఉద్యమంలా ముందుకు తీసుకుపోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యాటించానని, అనేక మంది పర్యావరణవేత్తలను కలిశాను.. కానీ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించి కోట్లాది మొక్కలు నాటిస్తున్న ఎంపీ సంతోశ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీలంకలో విస్తరించేలా తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.