హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తమ శక్తియుక్తులు, ప్రతిభాపాటవాలతో ఎన్నో విజయాలు సాధించాల్సిన యువత మత్తుమాయలో పడడం దురదృష్టకరమని ప్రముఖ సినీనటి కృతిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సాధికారిత విభాగాలు సంయుక్తంగా మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా మూడో రోజు సోమవారం యూసుఫ్గూడలోని ఫస్ట్బెటాలియన్లోని శౌర్య కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరైన కృతిశెట్టి మాట్లాడుతూ.. మంచి స్నేహితులు ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోమని బలవంతపెట్టరని అన్నారు. తోటివారి ఒత్తిడితోనే చెడు అలవాట్లకు ఆకర్షితులువుతుంటారని అన్నా రు. మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలను అరికట్టడంలో తమ వంతు బాధ్యత పోషిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
డ్రగ్స్కు బై చెబితేనే రాష్ట్రం బాగు
ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్ ఉండకూడదని అన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టడంలో అవగాహన కీలకమన్న ఆయన.. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని పేర్కొన్నారు. వారు బాధ్యతగా వ్యవహరిస్తూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. మంచి నడవడికతో దేశానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు. నేను, నా కుటుంబం, నా రాష్ట్రం, నా దేశం బాగుండాలనే ఆశయంతో ఎవరికి వారు తాము డ్రగ్స్కు దూరంగా ఉంటామని శపథం చేయాలని సూచించారు. అంతకుముందు డ్రగ్స్కు వ్యతిరేకంగా రూపొందించిన ‘సే గుడ్ బై టు డ్రగ్స్’ పోస్టర్, పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఏకాగ్రతతోనే లక్ష్యసాధన
హీరోయిన్ కృతిశెట్టి చిన్న వయసులోనే పలు భాషల్లో నటిస్తూ రాణిస్తున్నారని డీజీపీ అంజనీకుమార్ ప్రశంసించారు. ఏకాగ్రత, ప్రతిభ ఉంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొనారు. కృతిశెట్టి ఆమె స్నేహితులు ఇప్పటి వరకుఅల్కహాలు కూడా ముట్టలేదని, ఆమెతో పాటు ఆమె పరివారమంతా డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకమని అభినందించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల జీవితాలు అస్తవ్యస్తమవుతాయనే విషయాన్ని అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
యువతతో ప్రతిజ్ఞ
డ్రగ్స్పై అవగాహన కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, యువతతో డ్రగ్స్కు దూరం గా ఉంటామని, ఇతరులను దూరంగా ఉంచుతామంటూ యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా వాల్ పెయింటింగ్లు, ఆకర్షణీయమైన విజువల్స్ ద్వారా వివిధ కార్యక్రమాలలో పా ల్గొన్న విద్యార్థులు, యువతను అభినందించారు. కార్యక్రమంలో ఉమెన్, చిల్డ్రన్ డిజేబు ల్డ్ అండ్ సీనియర్ సిటిజన్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోలికేరి, డైరెక్టర్ శైలజతో పాటు వెస్ట్జోన్ డీసీపీ జోయెల్ డేవిస్, యాంటీ నార్కొటిక్ బ్యూరో ఎస్పీలు సునీ త, చక్రవర్తి గుమ్మి తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలి: డీజీపీ
డీఎస్పీలుగా ప్రమోషన్ పొందిన పోలీసు అధికారులు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాంక్షించారు. ఇటీవల పదోన్నతి పొందిన 141 మంది అధికారుల పిప్పింగ్ వేడుక సోమవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో పదోన్నతి ఓ మైలురాయని, విధి నిర్వహణలో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుందని చెప్పారు. సవాళ్లతో కూడిన పోలీస్ శాఖలో అదనపు బాధ్యతలు పెరుగుతాయని గుర్తుచేశారు. ఎక్కడ విధులు నిర్వర్తించినా అనుకూల పరిస్థితులు ఉండేలా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీలు సంజయ్కుమార్ జైన్, మహేశ్ భాగవత్, అభిలాశ బిస్త్, ఐజీలు కమలాసన్రెడ్డి, షానవాజ్ ఖాసీం, తరుణ్ జోషి, రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.