హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఇరవైనాలుగేండ్లుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవలు అందిస్తున్నదని, ఇప్పటివరకు 3.30 లక్షల మందికి రక్తదానం చేసినదని సినీ నటుడు రామ్చరణ్ తెలిపారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆదివారం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని రామ్చరణ్ ప్రారంభించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ తీసుకొంటున్న ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేసి ఆపదలో ఉన్న మరో ప్రాణిని కాపాడాలని రామ్చరణ్ కోరారు. సివిల్ సర్వీసెస్ అధికారులు “ఫెట్ ద మేళా” నిర్వహించారు. కార్యక్రమంలో ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ హరిప్రీత్ సింగ్, అకడమిక్ డైరెక్టర్ దివ్య, అధికారులు పాల్గొన్నారు.