సినీ తారల, రాజకీయ ప్రముఖుల వ్యక్తిత్వంపై బురద చల్లుతూ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను సినీ, రాజకీయరంగ ప్రముఖులు, ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కొండా సురేఖ పేరును నేరుగా ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై తెలుగు చిత్రసీమ ఘాటుగా స్పందించింది. సినీతారల వ్యక్తిగత జీవితంపై చెత్త మాటలు మాట్లాడొద్దంటూ స్పష్టంచేసింది. అభిమాన సంఘాలు సైతం కొండా వ్యాఖ్యలపై మండిపడ్డాయి. పలుచోట్ల మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. మరోవైపు తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని పేర్కొంటూ టాలీవుడ్ నటుడు నాగార్జున సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో ఆయన ఫిర్యాదు చేశారు.
Nagarjuna | నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. మంత్రి సురేఖ మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో, పత్రికల్లో ప్రధానంగా వచ్చాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కథనాల క్లిప్పింగులను కోర్టుకు సమర్పించారు. మంత్రి వ్యాఖ్యలతో తాను షాక్కు గురయ్యానని, అక్కినేని కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని పిటిషన్లో వివరించారు.
కేటీఆర్పై తప్పుడు ఆరోపణలు చేశారని, కన్వెన్షన్హాల్ కూల్చడానికి, మంత్రి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ తనకు (నాగార్జున) చెందినదని, నాగచైతన్య-సమంత విడాకులకు లింక్ లేదని, కేటీఆర్పై నిందారోపణలు చేసి అక్కినేని కుటుంబానికి ఉన్న పరువుకు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. జాతీయ చానళ్లు కూడా మంత్రి మీడియా సమావేశాన్ని ప్రసారం చేశాయని తెలిపారు. బిగ్బాగ్ హోస్ట్గా, సినిమా హీరోగా, నిర్మాతగా తనకు, తమ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ఠలను పాడుచేసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని, కావాలని ఆమె తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని, కేసు నమోదు చేసి వాస్తవాలను వెలికి తీయాలని కోర్టును కోరారు.