కొల్లాపూర్, అక్టోబర్ 15 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో టికెట్ను ఆశిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావుకు ఏఐసీసీ మొండిచెయ్యి చూపింది. పార్టీ అధిష్ఠానం ఆదివారం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కొల్లాపూర్ నుంచి జగదీశ్వర్రావుకు కాకుండా నెల రోజుల ముందు పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి జూపల్లికృష్ణారావుకు దక్కడంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు.
దీంతో పార్టీ కార్యకర్తలు ముకుమ్మడిగా కొల్లాపూర్లోని జగదీశ్వర్రావు ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లారు. కార్యాలయంపై ఏర్పాటు చేసిన బోర్డు, ఆఫీస్లో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఇతర నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను చించేశారు. ఒకానొకదశలో చింపిన ఫ్లెక్సీలకు నిప్పుపెట్టే ప్రయత్నం చేయడంతో కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు పేరును ఏఐసీసీ అధిష్ఠానం ప్రకటించడంతో చింతలపల్లి వర్గీయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2018 ఎన్నికల్లో యువకుడి చేతిలో చిత్తుగా ఓడిన జూపల్లికి ప్రజా బలం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినా.. జూపల్లి ప్రజాదరణ కోల్పోయాడని, అలాంటి వ్యక్తికి పార్టీ అధినాయకత్వం టికెట్ ఎట్లా ఇస్తుందంటున్నారు. ఇప్పటికైనా పునరాలోచించి జగదీశ్వర్రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలోని ఫాంహౌస్లో రాజకీయ భవిష్యత్పై టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ నాయకులు, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆ దిశగా ముందుకు వెళ్తామని చింతలపల్లి తెలిపారు.