కరీంనగర్ : తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్లోని 43వ డివిజన్లో రూ.20 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు సంస్థ విచారణ కోసం హైదరాబాద్ రావాలని తనను పిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ విచారణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి, వారికి కావలసిన సమాచారం ఇవ్వడానికి విదేశాల పర్యటన నుంచి వెనక్కివచ్చానని అన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, స్మార్ట్సిటీ నిధులతో ఎవరూ ఊహించనంతగా కరీంనగర్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ప్రధాన, అంతర్గత రహదారులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.