ధర్మారం, జనవరి5 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన వాలుక మల్లేష్ (45) హత్య( Murder) గురైన సంఘటన ప్రదేశాన్ని శుక్రవారం పెద్దపల్లి ఏసీపీఎడ్ల మహేష్(ACP Mahesh) పరిశీలించారు. ఈనెల 2న తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన మల్లేష్ గ్రామ శివారులో హత్య గురయ్యాడు. అతని మృతదేహాన్ని ఓ రైతు బావిలో పడేశారు.
కాగా, తన భర్త మృతిపై అదే గ్రామానికి చెందిన ఆకారి అంజయ్య అనే వ్యక్తిపై అనుమానం ఉందని మృతుని భార్య రజిత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అనుమానితుడు అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయినప్పటికీ మల్లేష్ ను ఎవరు హత్య చేశారనే విషయం తేలలేదు. దీంతో శుక్రవారం ఏసీపీ మహేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి హత్య చేసి పడేసిన వ్యవసాయ బావిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ మల్లేష్ హత్య సంఘటన విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. ఈ హత్య కేసును చేదించి నిందితులను పట్టుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. హత్య సంఘటనకు సంబంధించిన సమాచారం చెప్పిన వారికి రూ.50 వేల అవార్డు ఇస్తామని ప్రకటించారు.