హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల క్రితం 16 నెలల చిన్నారిపై లైంగికదాడి చేసిన నిందితుడికి భద్రాద్రి-కొత్తగూడెం ఏడీజే కోర్టు బుధవారం 25 ఏండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. అయితే ఈ కేసు దర్యాప్తులో, నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో అప్పటి భద్రాచలం ఏఎస్సీ, ప్రస్తుత టీఎస్ ఆర్టీసీ జేడీ సంగ్రామ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనను గురువారం ఎండీ సజ్జనార్ అభినందించి, సన్మానించారు. 2018 జూన్లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన అజ్మీరా సాయికిరణ్(22) చిన్నారిపై లైంగికదాడి చేశాడు.
ఈ కేసు సమయంలో భద్రాచలం ఏఎస్పీగా ఉన్న సంగ్రామ్సింగ్ ప్రత్యేక చొరవ తీసుకొని స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో పక్కా సాక్ష్యాధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్ నిర్వహించేలా చొరవ చూపారు. దీనిపై సంగ్రామ్ సింగ్ స్పందిస్తూ.. తన మొదటి కేసులోనే చరిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉన్నదన్నారు. కేసు దర్యాప్తునకు సహకరించిన సీఐ బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ముజామ్మిల్, రాజేంద్రకుమార్, హరిగోపాల్, కానిస్టేబుల్ హనుమంతరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మిని ఆయన అభినందించారు.