హైదరాబాద్ సిటీబ్యూరో/ఆర్కేపురం, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిపిన కుట్రలో అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ బీజేపీ దూతలకు ఏసీబీ కోర్టు శనివారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఫరీదాబాద్కు చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్కు చెందిన నందకుమార్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు నిందితులను మధ్యాహ్నం షేక్పేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మొయినాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు.
హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన అనంతరం సరూర్నగర్లోని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు విచారణను నవంబర్ 4వ తేదీ వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ మేజిస్ట్రేట్ నిందితులు ముగ్గురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిందితులను అరెస్టు చేయడానికి ముందు షేక్పేట్లోని నందకుమార్ ఇంటివద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. పోలీసులు రావడానికి ముందే నిందితులు మీడియా సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో పెద్ద ఎత్తున మీడియా ప్రతినిథులు నందు ఉంటున్న షేక్పేట్లోని ఆదిత్య హిల్టాప్ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో నిందితుల రిమాండ్కు అంగీకరిస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
దీంతో ఆ ముగ్గురు మీడియా ముందుకు వస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే మీడియాతో మాట్లాడిన తరువాత పోలీసులకు లొంగిపోవాలని ముగ్గురు నిందితులు నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. వారి కోసం మీడియా ప్రతినిధులు ఎదురుచూస్తుండగానే.. అక్కడికి చేరుకున్న పోలీసులు కోర్టు ఉత్తర్వులను నిందితులకు చూపించారు. వెంటనే మీడియా కంట పడకుండా వారిని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్కు తరలించారు. మీడియా కమిషనరేట్కు చేరుకోగా అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు మధ్య మీడియా కంట పడకుండా వెనక గేటు నుంచి ముందుగా మొయినాబాద్ ఠాణాకు, ఆ తరువాత చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితులను రిమాండ్కు తరలించే క్రమంలో పోలీసులు వారికి చేవెళ్ల ఏరియా దవాఖానలో వైద్య పరీక్షలు జరిపారు.