హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వైట్ కాలర్ నేరాలతో రూ.33.34 కోట్ల మోసాలకు పాల్పడి మూడేండ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న మద్దూరు ఉమాశంకర్ను తెలంగాణ సీఐడీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉమాశంకర్పై ఇప్పటికే 3 నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీకావడంతో సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఎస్పీ రాంరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు కొంపల్లిలో ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. ఆర్కేపురంలోని కొత్తపేటకు చెందిన ఉమాశంకర్ ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తి ‘అవర్ ప్లేస్’ పేరుతో ఓ దొంగ సంస్థను నెలకొల్పాడు. ఆ సంస్థ ఆధ్వర్యంలో గోశాలలు, నిరాశ్రయులకు నైట్ షెల్టర్ల నిర్మాణం, వృద్ధాశ్రమాల్లో అన్నదానం, పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తానంటూ 2006 నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఆ లావాదేవీలకు ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, ఉమాశంకర్ కార్యాచరణలో ఎలాంటి కదలిక లేకపోవడంతో డబ్బులిచ్చినవారు నిలదీశారు. ఆ డబ్బును ధార్మిక కార్యక్రమాలకు కాకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు గుర్తించడంతో మూడేండ్ల తర్వాత పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉమాశంకర్ రూ.33.34 కోట్ల మోసానికి పాల్పడినట్టు గుర్తించి కోర్టుకు సరెండర్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై వచ్చిన ఉమాశంకర్.. 2020 నుంచి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో 3 నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఐడీ పోలీసులు పక్కా ప్రణాళికతో ఉమాశంకర్ను అరెస్టు చేసి, కోర్టుకు అప్పగించారు.