వేములవాడ, జనవరి 17: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణ పోలీసుల(Vemulawada police station) కండ్లుగప్పి ఓ నిందితుడు(Accused) ఠాణా నుంచి తప్పించుకోవడం పోలీసుశాఖలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లికి చెందిన ఒకరిపై దాడి చేసిన సంఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. నిందితులను రిమాండ్ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు.
అందులో ఒకరు గంభీరావుపేట ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని మంగళవారం రాత్రి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రిమాండ్ చేయాల్సి ఉండగా ఉదయం పూట సదరు నిందితుడు చాకచక్యంగా స్టేషన్ నుంచి పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, విధుల నిర్లక్ష్యంపై మాత్రం జిల్లా పోలీస్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.